దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ ఆధారంగా అమీర్ ఖాన్ సినిమా చేయబోతున్నారు. ఈక్రమంలో రాజమౌళి, ఎన్టీఆర్ లకు ఫాల్కే మనవడు పెద్ద షాకిచ్చాడు.
బెంగళూరు: భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ గురించి చర్చలు జరుగుతున్న వేళ, ఆయన మనవడు చంద్రశేఖర్ పుసాళ్కర్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. రాజమౌళి ఈ బయోపిక్ తీస్తారన్న వార్తలపై పుసాళ్కర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమిర్ ఖాన్ దీన్ని తీస్తే బాగుంటుందని అన్నారు.
ఫాల్కే జీవితాన్ని రాజమౌళి కమర్షియల్గా మారుస్తాడేమో
ఫాల్కే జీవిత కథ కేవలం వినోదం కాదని, చరిత్రకు న్యాయం చేస్తూ, భావితరాలకు స్ఫూర్తినివ్వాలని పుసాళ్కర్ అన్నారు. రాజమౌళి తన 'ఆర్ఆర్ఆర్' లాంటి భారీ, కల్పిత అంశాలున్న సినిమాలకు పేరుపొందారు.
ఫాల్కే బయోపిక్ని కూడా అదే తరహాలో, కమర్షియల్ యాంగిల్లో చరిత్రను పక్కనబెట్టి తీస్తారేమోనని పుసాళ్కర్ ఆందోళన వ్యక్తం చేశారు. "ఫాల్కే జీవితం కల్పిత కథ కాదు. అది భారతీయ సినిమా తొలినాళ్ల కష్టాలు, త్యాగాలు, పట్టుదల గురించిన కథ. దాన్ని యథాతథంగా, గౌరవంగా చూపించాలి" అని అన్నారు.
ఫాల్కే జీవితంపై వచ్చిన మూవీపై ఫాలే మనవడు అసంతృప్తి
పరేష్ రావల్ ఫాల్కేగా నటించిన ఓ సినిమాపై కూడా పుసాళ్కర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కుటుంబాన్ని సంప్రదించకుండా, తప్పుడు సమాచారంతో తీశారని ఆరోపించారు. భవిష్యత్తులో బయోపిక్లు తీసేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు, అనుమతి తీసుకోవాలని సూచించారు.
అమీర్ ఖాన్ పై పుసాళ్కర్ ప్రశంసలు
ఆమిర్ ఖాన్ పనితీరును పుసాళ్కర్ మెచ్చుకున్నారు. ఆమిర్ ఏ పాత్ర చేసినా లోతైన పరిశోధన చేసి, న్యాయం చేస్తారని అన్నారు. "ఆమిర్ 'లగాన్' లాంటి సినిమాల్లో తన పరిశోధనాత్మక, కళాత్మక నిబద్ధతను చూపించారు.
ఆయన ఫాల్కే బయోపిక్ తీస్తే, అది నిజానికి దగ్గరగా, గౌరవప్రదంగా ఉంటుంది. గతంలో ఆమిర్ ఖాన్ బృందం ఫాల్కే గురించి పరిశోధన కోసం మమ్మల్ని సంప్రదించింది, కానీ ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు" అని పుసాళ్కర్ తెలిపారు.
దాదా సాహెబ్ ఫాల్కే జీవితం భవిష్యత్ తరాలకు స్ఫూర్తివంతంగా ఉండాలి
ఫాల్కే బయోపిక్ కేవలం వసూళ్ల కోసం కాకుండా, చారిత్రక ప్రతిరూపంగా, యువ దర్శకులకు స్ఫూర్తిగా నిలవాలని ఆయన కుటుంబం కోరుకుంటోంది.
రాజమౌళి లాంటి దర్శకుడు ఈ ప్రాజెక్ట్పై ఆసక్తి చూపించడం ఆసక్తికరమే అయినా, ఫాల్కే మనవడి వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. ఓ రకంగా ఇది ఎన్టీఆర్, రాజమౌళిలకు పెద్ద షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఎన్టీఆర్తో రాజమౌళి ఫాల్కే జీవితంపై బయోపిక్ తీయాలని భావించిన విషయం తెలిసిందే.