రాజశేఖర్, జీవితాలకు బిగ్ షాక్.. `శేఖర్` మూవీ ప్రదర్శన నిలిపివేత..
రాజశేఖర్ హీరోగా నటించిన `శేఖర్` మూవీ శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి కోర్ట్ షాకిచ్చింది. నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
హీరో రాజశేఖర్ (Rajashekar) ఫ్యామిలీకి బిగ్ షాక్ తగిలింది. `శేఖర్`(Shekar Movie) సినిమాకి కోర్ట్ పెద్ద ఝలక్ ఇచ్చింది. రాజశేఖర్ హీరోగా నటించిన `శేఖర్` మూవీ నిలిపివేయాలంటూ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ రోజు సాయంత్రం నుంచి సినిమా ప్రదర్శన ఆగిపోయింది. ఈ సినిమా దాదాపు అన్ని ఏరియాల్లో ఆగిపోయినట్టు ఫైనాన్షియర్ ఎ.పరంధామరెడ్డి వెల్లడించారు. శుక్రవారం విడుదలైన సినిమా ప్రదర్శనని కోర్ట్ ఆదేశాల మేరకు ఆదివారం నుంచి థియేటర్లలో నిలుపుదల చేశారని ఆయన పేర్కొన్నారు.
తన వద్ద రూ. 65,00,000/- (అరవై ఐదు లక్షల రూపాయలు) అప్పుగా తీసుకున్న నిర్మాత,దర్శకురాలు శ్రీమతి జీవిత రాజశేఖర్ తిరిగి చెల్లించకపోవడంతో తాను హైదరాబాద్ లోని గౌరవనీయ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించానని, ఆ మేరకు 48 గంటల లోగా అనగా ఆదివారం సాయంత్రం 4-30 గంటలు లోగా Rs. 65,00,000/- (అరవై ఐదు లక్షల రూపాయలు) సెక్యూరిటీ డిపాజిట్ కోర్టులో శ్రీమతి జీవిత రాజశేఖర్ సమర్పించాలని, ఒకవేళ అలా డిపాజిట్ చేయలేనిపక్షంలో ''శేఖర్" సినిమాకు సంబందించిన సర్వ హక్కులను (నెగటివ్ రైట్)అటాచ్ మెంట్ చేస్తూ అనగా థియేటర్స్ లో కానీ డిజిటల్, శాటిలైట్, ఓటీటీ, ఎటీటీ, యూట్యూబ్ వంటి వివిధ రకాల ఫ్లాట్ ఫామ్స్ లో సినిమా తోపాటు ట్రైలర్,పాటలతోసహ ఎలాంటి కంటెంట్ ఎక్కడా ప్రసారం చేయకుండా నిలుపుదల చేస్తూ, కోర్టు ఆదేశాలు జారీ చేసిందని పరంధామరెడ్డి వివరించారు.
కోర్టు ఆదేశాలను ధిక్కరించి ఎవరైనా 'శేఖర్" సినిమాను ప్రదర్శిస్తే CONTEMPT OF COURT అవుతుందని ఎ.పరంధామరెడ్డి హెచ్చరించారు. ఇక ఈ చిత్రం నిర్మాతను తాను అని, సినిమాకు ఎవరైనా ఆటంకం కలిగిస్తే పరువు నష్టం దావా వేస్తానని బీరం సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి చెబుతున్నారు, కానీ ఈ విషయానికి సంబంధించిన అన్ని వ్యవహారాలను తాను లీగల్ గానే తేల్చుకోదలచుకున్నాను. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని పరంధామరెడ్డి స్పష్టం చేశారు. కోర్టు ఉత్తర్వులను గౌరవించి, శేఖర్ సినిమా ప్రదర్శనలను నిలుపుదల చేసిన థియేటర్స్ వారికి, డిజిటల్ ప్రొవైడర్స్ వారికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. దీంతో ఈ రోజు సాయంత్రం నుంచి `శేఖర్` మూవీ నిలిచిపోయినట్టు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాకి నిర్మాతను తానే అని బీరం సుధాకర్ రెడ్డి తెలిపిన విషయంతెలిసిందే. కొందరు కావాలని కుట్ర చేస్తున్నారని, తాను దర్శకురాలు జీవితకి, హీరోకి పారితోషికం ఇచ్చానని చెప్పారు. తమ సినిమాని అడ్డుకుంటే నష్టపరిహారం కోసం, పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. అంతేకాదా దీనిపై హీరో రాజశేఖర్ కూడా స్పందించి ఫైర్ అయ్యారు. `నాకూ, నా కుటుంబానికీ ఈ సినిమా సర్వస్వం. ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చాలా కష్టపడ్డాం. ‘శేఖర్’కి అంతటా అద్భుతమైన స్పందన వస్తోంది. కానీ కొందరు కుట్ర పన్ని.. మా సినిమా ప్రదర్శనను నిలిపివేశారు. సినిమా మా ప్రాణం. ఈ సినిమా మాది. నేను చెప్పాల్సిన విషయాలు అయిపోయాయి. ఈ చిత్రానికి నిజంగా అర్హమైన దృశ్యమానత మరియు ప్రశంసలు లభిస్తాయని నేను ఆశిస్తున్నా` అని తెలిపారు రాజశేఖర్.