టాప్‌ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌పై ఫిర్యాదు వచ్చింది. అది ఏకంగా పవన్‌ కళ్యాణ్‌కే ఫిర్యాదు చేయడం విశేషం. ప్రజవాణిలో భాగంగా ఈ ఫిర్యాదు వచ్చింది.  

పవన్‌ కళ్యాణ్‌ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం అలా చేశాడో లేదో సినిమాకి సంబంధించిన ఫిర్యాదుల పర్వం సాగుతుంది. ఏపీ ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రజలు తమ సమస్యలను ప్రజావాణికి ఫిర్యాదు చేస్తున్నారు. ఈ క్రమంలో జనసేన నాయకుడు, డాన్స్ మాస్టర్‌ జానీ మాస్టర్‌పై ఫిర్యాదు వచ్చింది. ఆయనపై పవన్‌ కళ్యాణ్‌కి మరో డాన్సర్‌ ఫిర్యాదు చేయడం విశేషం.

సతీష్‌ అనే డాన్సర్‌ జానీ మాస్టర్‌ చేస్తున్న అరాచకాలపై డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌కి కొరియర్‌ ద్వారా ఫిర్యాదు చేశాడు. ప్రజావాణిలో భాగంగా ఆయన ఈ ఫిర్యాదు చేయడం విశేషం. తనని కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ వేధిస్తున్నారని రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌లో ఈ నెల 5న డాన్సర్‌ సతీష్‌ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తనని షూటింగ్‌లకు పిలవకుండా వేధిస్తున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. 

షూటింగ్‌లకు సతీష్‌ని పిలవద్దని జానీ మాస్టర్‌ తమ డాన్స్ యూనియన్‌ సభ్యలతో ఫోన్లు చేయిస్తున్నాడని సతీష్‌ పేర్కొన్నారు. దీంతో గత నాలుగు నెలలుగా ఉపాధి లేకుండా ఇబ్బందులు పడుతున్నానని వెల్లడించారు. జనరల్‌ బాడీ మీటింగ్‌లోనూ సమస్యలపై మాట్లాడినందుకే జానీ మాస్టర్‌ తనపై ఇలా చేస్తున్నాడని సతీష్‌ పేర్కొన్నాడు. తెలుగు ఫిల్మ్ అండ్‌ టీవీ డాన్సర్స్ అండ్‌ డాన్స్‌ డైరెక్టర్స్ అసోసియేషన్‌కి జానీ మాస్టర్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.

జానీ మాస్టర్‌ జనసేన పార్టీలో చేరి ఇటీవల అగ్రెసివ్‌గా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. ప్రత్యర్థులపై విరుచుకుపడ్డాడు. అంతేకాదు ఎమ్మెల్యే పదవి కోసం టికెట్ కూడా ఆశించాడు. కూటమి సర్దుబాటులో భాగంగా ఆయనకు టికెట్‌ రాలేదు. కానీ జనసేన నాయకుడిగా కొనసాగుతున్నారు. మరి జానీ మాస్టర్‌ పై వచ్చిన ఫిర్యాదుని పవన్‌ కళ్యాణ్‌ ఎలా తీసుకుంటాడు, ఎలా పరిష్కరిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.