సీఎం జగన్ నుంచి చిరంజీవికి ఆహ్వానం.. పేర్ని నాని ఫోన్ చేసి..
టాలీవుడ్, థియేటర్ సమస్యలు, టికెట్ ధరల విషయంలో కీలక అడుగు పడింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్..మెగాస్టార్ చిరంజీవిని భేటీకి ఆహ్వానించారు.
టాలీవుడ్, థియేటర్ సమస్యలు, టికెట్ ధరల విషయంలో కీలక అడుగు పడింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్..మెగాస్టార్ చిరంజీవిని భేటీకి ఆహ్వానించారు. త్వరలోనే జరగబోయే సీఎం జగన్, మెగాస్టార్ చిరంజీవి భేటీ గురించి టాలీవుడ్, థియేటర్స్ యాజమాన్యాలు మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
పూర్తి వివరాల్లోకి వెళితే.. మంత్రి పేర్ని నాని శనివారం ఉదయం చిరంజీవికి స్వయంగా ఫోన్ చేశారు. సినీ పెద్దలతో కలసి వచ్చి ప్రస్తుతం టాలీవుడ్, థియేటర్స్ విషయంలో నెలకొని ఉన్న సమస్యలని సీఎం జగన్ కి విన్నవించాలని కోరారు.
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గాక ఇటీవల ఏపీ ప్రభుత్వం థియేటర్ల రీ ఓపెన్ కి అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ ప్రస్తుతం ప్రభుత్వం నిర్ణయించిన టికెట్ ధరలు, ఇంకా కరోనా భయంతో ప్రజలు థియేటర్లకు రాకపోవడం, మూడు షోలకే అనుమతి ఉండడం, 50 శాతం ఆక్యుపెన్సీ కావడం లాంటి కారణాలతో ఏపీలో థియేటర్స్ ఓపెన్ చేసేందుకు ఎగ్జిబిటర్లు ముందుకు రాలేదు.
ఈ సమస్యపై ఓ పరిష్కారానికి టాలీవుడ్ ప్రముఖులు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టకేలకు జగన్ నుంచి చిరంజీవికి ఆహ్వానం వచ్చింది. గతంలో చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, సురేష్ బాబు లాంటి ప్రముఖులు జగన్ ని కలసి సమస్యలు వివరించారు. ఆ సమయంలో జగన్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
అయితే వకీల్ సాబ్ చిత్రం విడుదలైనప్పటి నుంచి ఏపీలో టికెట్ ధరలు భారీగా తగ్గిపోయాయి. మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్ నిర్వహించి మరీ వకీల్ సాబ్ చిత్రం బాగాలేదు అని రివ్యూలు కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు టాలీవుడ్ సమస్యల్ని పరిష్కరించడానికి అదే పేర్ని నాని చొరవ చూపడం ఆసక్తిగా మారింది.