Asianet News TeluguAsianet News Telugu

`లూసిఫర్‌` రీమేక్‌ని స్టార్ట్ చేసిన మెగాస్టార్‌ చిరంజీవి.. గ్రాండ్‌గా ఓపెనింగ్‌

చిరంజీవి `లూసిఫర్‌` రీమేక్‌ని మోహన్‌ రాజా దర్శకత్వంలో చేస్తున్నారు. చిరంజీవి నటిస్తున్న 153వ చిత్రమిది. నేడు బుధవారం హైదరాబాద్‌లోని సూపర్‌ గుడ్‌ సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమాని ప్రారంభించారు.

chiranjeevi started lucifer remake with mohan raja  arj
Author
Hyderabad, First Published Jan 20, 2021, 5:49 PM IST

మెగాస్టార్‌ చిరంజీవి బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. సినిమాలకు ఓకే చెప్పడమే కాదు, ప్రారంభించి షూటింగ్‌లకు తీసుకెళ్తున్నాడు. `ఆచార్య` షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. తాజాగా మరో సినిమాని ప్రారంభించారు. మలయాళ సూపర్‌ హిట్‌ `లూసిఫర్‌` రీమేక్‌ని బుధవారం ప్రారంభించారు. ఈ సినిమాకి తమిళ దర్శకుడు మోహన్‌ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. సురేఖ సమర్పణలో, కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్‌ గుడ్‌ ఫిల్మ్స్, ఎన్‌ వీ ఆర్‌ ఫిల్మ్స్ పతాకాలపై ఆర్‌బి చౌదరి, ఎన్‌ వి ప్రసాద్‌ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 

చిరంజీవి నటిస్తున్న 153వ చిత్రమిది. నేడు సూపర్‌ గుడ్‌ సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమాని ప్రారంభించారు. ఇందులో చిరంజీవి, మోహన్‌రాజా, అల్లు అరవింద్‌, నాగబాబు, అశ్వినీదత్‌, డివివి దానయ్య, నిరంజన్‌రెడ్డి, చిత్ర సంగీత దర్శకుడు ఎస్‌.ఎస్‌. థమన్‌, కొరటాల శివ, ఠాగూర్‌ మధు, జెమినీ కిరణ్‌, రచయిత సత్యానంద్‌, మెహర్‌ రమేష్‌, బాబీ, రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, మిర్యాల రవీందర్‌రెడ్డి, నవీన్‌ ఎర్నేని, శిరీష్‌ రెడ్డి, యూ వి క్రియేషన్స్ విక్కీ తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్బంగా చిత్ర నిర్మాతలు ఆర్ బి చౌదరి, ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ, `ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. మన నేటివిటీకి త‌గ్గ‌ట్టుగా ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క స్క్రిప్టును మోహ‌న్ రాజా అద్భుతంగా స్క్రిప్ట్ సిద్ధం చేసారు. మెగాస్టార్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ సినిమాగా ఇది నిలుస్తుంద`న్నారు. ద‌ర్శ‌కుడు మోహ‌న్ రాజా మాట్లాడుతూ, మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. అయన అభిమానులు కోరుకునే రేంజ్ లో ఈ సినిమా ఉంటుంది. మెగాస్టార్ కెరీర్ లో మరో భిన్నమైన సినిమా అవుతుంది. ఇది పూర్తిస్థాయి రీమేక్ సినిమా కాదు. ఆ కథను తీసుకుని మెగాస్టార్ ఇమేజ్ కి తగ్గట్టుగా మార్చి తెరకెక్కించబోతున్నాం, మిగతా నటీనటుల వివరాలు త్వరలో వెల్లడిస్తాం` అని చెప్పారు. 

ఈ చిత్రానికి కెమెరామెన్‌గా నీరవ్‌ షా, రచయితగా లక్ష్మీ భూపాల్‌, ఆర్ట్ డైరెక్టర్‌గా సురేష్‌ సెల్వరాజన్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌గా వాకాడ అప్పారావు, స్క్రీన్‌ప్లే, డైరెక్టర్‌గా మోహన్‌రాజా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాని ఈ ఏడాదిలోనే విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు. దీంతో ఈ ఏడాది మెగాస్టార్ `ఆచార్య`తోపాటు ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios