కరోనా సెకండ్వేవ్పై చిరంజీవి ఆందోళన.. ఎమోషనల్ వీడియో షేర్
సెలబ్రిటీలు కరోనా జాగ్రత్తలు చెబుతూ మరింత అప్రమత్తం చేస్తున్నారు. తాజాగా చిరంజీవి స్పందిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. జాగ్రత్తగా లేకపోతే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు.
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. జనాలు కుప్పలుగా రాలిపోతున్నారు. రోజుకి వేల మంది చనిపోతున్నారు. రోజువారి కేసులు దేశంలో మూడున్నర లక్షలకుపైగా నమోదవుతున్నాయి. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది. ఈ నేపథ్యంలో సెలబ్రిటీలు కరోనా జాగ్రత్తలు చెబుతూ మరింత అప్రమత్తం చేస్తున్నారు. తాజాగా చిరంజీవి స్పందిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. జాగ్రత్తగా లేకపోతే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ ఎమోషనల్ వీడియోని పంచుకున్నారు.
`కరోనా సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉంది. చాలామంది వైరస్ బారిన పడి ప్రాణాలతో పోరాడుతున్నారు. కోలుకోవడానికి చాలా సమయం పడుతోంది. వైరస్ వల్ల మన ఆత్మీయుల్ని కోల్పోతున్నామంటే గుండె తరుక్కుపోతోంది. ఈ తప్పని పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ లాక్ డౌన్ వేశారు. కనీసం ఇప్పుడైనా అలక్ష్యం చేయకుండా ఉండండి. ఇంటి నుంచి బయటకు రావొద్దు. అత్యవసరమై బయటికి వచ్చినప్పుడు తప్పకుండా మాస్క్ ధరించండి. వీలైతే డబుల్ మాస్క్ ధరించండి. లాక్ డౌన్ లో కూడా వ్యాక్సినేషన్ సాగుతోంది. రిజిస్ట్రేషన్ చేసుకుని అందరూ వ్యాక్సినేషన్ తీస్కోండి.
ఒకవేళ వ్యాక్సిన్ వేసుకున్నాక కరోనా పాజిటివ్ వచ్చినా ప్రభావం తక్కువ. కోవిడ్ పాజిటివ్ వచ్చినా ప్యానిక్ అవ్వకండి. వైరస్ కంటే మన భయమే మనల్ని ముందుగా చంపేస్తోంది. కరోనా పాజిటివ్ అని తెలియానే ఐసోలేషన్ కి వెళ్లండి. మిమ్మల్ని మీరు వేరు చేసుకోండి. డాక్టర్ ని సంప్రదించండి. మందులు వాడండి. ఊపిరి సమస్య తలెత్తితే వెంటనే ఆస్పత్రిలో చేరండి. కరోనా చికిత్స పొందిన తర్వాత నెలరోజుల్లో యాంటీబాడీస్ తయారవుతాయి. మీరు ప్లాస్మా దానం చేస్తే ఒక్కొక్కరు మరో ఇద్దరిని కాపాడిన వారు అవుతారు. ఈ విపత్తు సమయంలో వీలైనంత మందికి ఈ విషయం చెప్పండి. మనల్ని మనం కాపాడుకుంటే దేశాన్ని రక్షించిన వాళ్లం అవుతాం. అన్ని జాగ్రత్తలు తీసుకుని సురక్షితంగా ఉండండి. మీరు జాగ్రత్తగా ఉంటే మీ ఊరిని కాపాడిన వాళ్లవుతారు. తద్వారా రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడిన వారవుతారు` అని తెలిపారు చిరంజీవి.
ప్రస్తుతం చిరంజీవి `ఆచార్య` చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఇది రూపొందుతుంది. కాజల్ హీరోయిన్గా నటిస్తుంది. రామ్చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయనకు జోడిగా పూజా హెగ్డే కనిపించబోతుంది. ఈ సినిమా కరోనా వల్ల వాయిదా పడిన విషయం తెలిసిందే.