తన ఇంట్లో నలుగురికి కరోనా.. షాకింగ్ విషయాలు వెల్లడించిన చిరు
సైబరాబాద్ సీపీ సజ్జనార్ ప్లాస్మా డోనేషన్ కి సంబంధించిన ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న చిరంజీవి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన ఇంట్లో నలుగురికి వైరస్ సోకిందని తెలిపారు.
మెగాస్టార్ చిరంజీవి తాజాగా పలు షాకింగ్ విషయాలను వెల్లడించారు. తన ఇంట్లో నలుగురికి పాజిటివ్ వచ్చిందని తెలిపి అభిమానులను షాక్కి గురి చేశారు. శుక్రవారం సైబరాబాద్ సీపీ సజ్జనార్ ప్లాస్మా డోనేషన్ కి సంబంధించిన ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న చిరంజీవి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన ఇంట్లో నలుగురికి వైరస్ సోకిందని తెలిపారు. ఈ విషయం ఇన్ని రోజులు దాచిన చిరు, శుక్రవారం బహిర్గతం చేశారు. అంతేకాదు వారు ప్లాస్మా దానం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.
ఆ వివరాలు వెల్లడిస్తూ, తమ ఇంట్లో పనిచేసే వంట మనిషి శ్రీను, స్విమ్మింగ్ పూల్ కడిగే లక్ష్మణ్, అలాగే కూరగాయలు తరిమే మహిళ, వంట మనిషి కొడుకుకు పాజిటివ్ వచ్చిందని, వాళ్లకి పాజిటివ్ నిర్ధారణ కాగానే వెంటనే ప్రత్యేకంగా ఓ ప్లాట్ని అద్దెకు తీసుకుని అందులో క్వారంటైన్ చేశామని చిరు చెప్పారు. నెలన్నర రోజుల కిందే వాళ్లకు నయం అయిపోయిందని, వాళ్లకు రెండు సార్లు నెగిటివ్ వచ్చిన తర్వాత మళ్లీ తమ ఇంట్లోనే పని చేసుకుంటున్నట్లు చెప్పాడు చిరంజీవి. అయితే వారికి వాడే మెడిసిన్ రెగ్యూలర్ మెడిసినే అని వెల్లడించారు. ఇప్పుడు వాళ్లు కూడా ప్లాస్మా డొనేషన్ క్యాంపులో పాల్గొన్నారని చెప్పాడు. వాళ్లందరూ అజాగ్రత్తగా ఉండటం వల్లే కరోనా బారిన పడ్డారని, అంతా బాగుంది కాబట్టి ఇప్పుడేం సమస్య లేదని తెలిపారు.
మరోవైపు ప్లాస్మా ప్రాధాన్యతని, అది ఒక మనిషి జీవితాన్ని ఎలా కాపాడుతుందో తెలియజేస్తూ, తమ దూరపు బంధువుల అబ్బాయికి కూడా కరోనా వచ్చిందని, డాక్టర్లు కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో కేవలం ప్లాస్మా డొనేట్ వల్లే ఆయన్ని బతికించగలమని వైద్యులు చెప్పడంతో తన ఫ్యాన్స్ ప్రెసిడెంట్ స్వామి నాయుడు ఇచ్చాడని చెప్పాడు. దీంతో అతను సురక్షితంగా బయటపడినట్టు చిరంజీవి తెలిపారు. దీంతో తమ ఇంట్లో కరోనా సోకిందని చిరు చెప్పడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్కి గురవుతుంది. ఇప్పుడందరూ దాన్నుంచి బయటపడటంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. మొత్తంగా ప్లాస్మా ఇప్పుడు సంజీవనిగా మారిందని, వైరస్ నుంచి కోలుకున్న వారు కచ్చితంగా ప్రతి వారానికి ఒకసారి ప్లాస్మా డొనేట్ చేయాలని, దీంతో పదుల సంఖ్యలో ప్రాణాలను కాపాడిన వారవుతారని తెలిపారు.
తాను బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేయడం గురించి వెల్లడిస్తూ, బ్లడ్ దొరక్క ఇబ్బంది పడుతున్న వారిని ఆదుకోవడానికి సీసీటీ తరపున బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశానని, చిరంజీవి బ్లడ్ బ్యాంక్కు బెస్ట్ బ్లడ్ బ్యాంక్ అవార్డ్ వచ్చిందని, డిసెంబర్ 1న అవార్డు తీసుకోబోతున్నానని తెలిపారు.