మొత్తానికి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మెగాస్టార్.. 153వ చిత్రం కన్ఫమ్..
మోహన్ రాజా దర్శకత్వంలో `లూసీఫర్` రీమేక్ ఉంటుందని బుధవారం అధికారికంగా ప్రకటించారు. జనవరి 2021 సంక్రాంతి తర్వాత సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, `లూసీఫర్` సినిమా స్క్రిప్టు ఫైనల్ అయ్యిందన్నారు.
మెగాస్టార్ చిరంజీవి జోరు మీదున్నారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ ఐదు సినిమాలను లైన్లో పెడితే, తాను మాత్రం ఏం తక్కువ కాదని నిరూపించుకునేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఆయన `ఆచార్య` చిత్రంలో నటిస్తున్నారు. మరోవైపు నెక్ట్స్ సినిమాని కన్ఫమ్ చేశాడు. `లూసీఫర్` రీమేక్లో నటించబోతున్నట్టు వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు దాన్ని ఖరారు చేశాడు చిరు. `లూసీఫర్` స్ర్కిప్ట్ పై నలుగురు దర్శకుల పేర్లు వినిపించగా, ఫైన్లో ఐదో దర్శకుడు కన్సమ్ అయ్యాడు.
మొదట `సాహో` ఫేమ్ సుజిత్ వర్క్ చేశారు. ఆయనే దర్శకుడు అని అంతా అనుకున్నారు. కానీ స్క్రిప్ట్ విషయంలో చిరు సంతృప్తి చెందలేదు. ఆ తర్వాత బాబీ పనిచేశారని, అది కూడా నచ్చలేదని, దీంతో వివి వినాయక్ వద్దకు వెళ్ళిందని, ఆయన చేసిన మార్పుల విషయంలోనూ చిరు సాటిస్పై కాలేదని, దీంతో హరీష్ శంకర్ వర్క్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. అవన్నీ పక్కకు పోయి తమిళ దర్శకుడు మోహన్ రాజా ట్రాక్లోకి వచ్చాడు. మోహన్ రాజా చేసిన మార్పుల విషయంలో సాటిస్పై అయిన చిరు ఎట్టకేలకు తన 153వ చిత్రాన్ని ప్రకటించారు.
మోహన్ రాజా దర్శకత్వంలో `లూసీఫర్` రీమేక్ ఉంటుందని బుధవారం అధికారికంగా ప్రకటించారు. జనవరి 2021 సంక్రాంతి తర్వాత సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, `లూసీఫర్` సినిమా స్క్రిప్టు ఫైనల్ అయ్యింది. `తనిఒరువన్` (తెలుగులో `ధృవ`) ఫేం మోహన్ రాజా దర్శకత్వం వహిస్తారు. మన నేటివిటీకి తగ్గట్టుగా ఈ ప్రతిష్ఠాత్మక స్క్రిప్టును మోహన్ రాజా చాలా బాగా నేరేట్ చేశాడు. సంక్రాంతి తర్వాత సెట్స్ కెళతాం. ఫిబ్రవరి-మార్చి - ఏప్రిల్ లో జరిగే షూటింగ్ తో ఈ 153 వ సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. నాతో సినిమా చేయాలని వేచి చూస్తున్న చిరకాల సన్నిహితులు ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నా సినిమాల పంపిణీదారుడిగా ఆయనతో ఎంతో అనుబంధం ఉంది` అని తెలిపారు.
దర్శకుడు మోహన్ రాజా మాట్లాడుతూ, `మెగాస్టార్ చిరంజీవి నటించిన `హిట్లర్` చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాను. ఇప్పుడు ఆయన్ని డైరెక్ట్ చేసే అవకాశం దక్కడం పూర్వజన్మ సుకృతంగా, అదృష్టంగా భావిస్తున్నా. ఈ అవకాశం దక్కినందుకు ఆనందంగా ఉంది. దర్శకుడిగా నాకిది నెక్ట్స్ లెవల్ చిత్రమవుతుంది` అని తెలిపారు.
కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ అండ్ ఎన్.వి. ప్రసాద్ (ఎన్ .వి.ఆర్ సినిమా) సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ సినిమా గురించి నిర్మాత ఎన్.వి. ప్రసాద్ మాట్లాడుతూ, `చిరంజీవి గారి సినిమాని మోహన్ రాజా తెరకెక్కించడం చాలా సంతోషంగా ఉంది. చిరంజీవి వారితో పాటుగా మా అందరికీ నచ్చేలా మార్పులు చేర్పులతో ఎంతో అద్భుతంగా ఈ స్క్రిప్టును మలిచి మోహన్ రాజా మెప్పించారు. బాస్ తో సినిమా అంటేనే కొత్త ఉత్సాహం అందరిలో నెలకొంది. రాజీ పడకుండా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం` అని తెలిపారు.
మోహన్ రాజా ప్రఖ్యాత ఎడిటర్ మోహన్ వారసుడిగా సుపరిచితం. ఆయన తమిళంలో పాపులర్ డైరెక్టర్. ఐదు తెలుగు సినిమాల్ని తమిళంలోకి రీమేక్ చేసి బ్లాక్ బస్టర్లు చేసిన రికార్డ్ తనకు ఉంది. ఎడిటర్ మోహన్ నిర్మించిన `హిట్లర్` సినిమాకి ముత్యాల సుబ్బయ్య వద్ద మోహన్ రాజా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. తమిళంలో సంచలన విజయం సాధించిన `తని ఒరువన్` (జయం రవి హీరో) దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.