యువతిని మోసగించిన సినీ రచయిత!
సినిమా ఇండస్ట్రీకి చెందిన యువ రచయిత ఓ అమ్మాయిని ప్రేమించి, పెళ్లి చేసుకొని మోసం చేసిన సంగతి వెలుగులోకి వచ్చింది.
సినిమా ఇండస్ట్రీకి చెందిన యువ రచయిత ఓ అమ్మాయిని ప్రేమించి, పెళ్లి చేసుకొని మోసం చేసిన సంగతి వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. వైజాగ్ ఎంవీపీ కాలనీలో నివసించే యర్రంశెట్టి రమణగౌతం (28) బుల్లితెరతో పాటు వెండితెరకు కథలు రాస్తూ ఫిలింనగర్ లో గత ఆరేళ్లుగా జీవిస్తున్నాడు.
బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ఎన్బీటీనగర్లో నివసించే యువతి (23) సినిమాల మీద ఇష్టంతో స్టూడియోల చుట్టూ తిరుగుతున్న సమయంలో రమణతో పరిచయం ఏర్పడింది. సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తానని ఆమెని ప్రేమలోకి దించాడు. 2016లో మొదలైన వీరి పరిచయం ఆ తరువాత సహజీవనానికి దారి తీసింది.
ఆ తరువాత ఆమెకి ఉద్యోగ అవకాశాలు రావడంతో దుబాయ్, సింగపూర్, బెహ్రాన్ దేశాలకు వెళ్లింది. అక్కడ సంపాదించిన డబ్బుని పెళ్లి చేసుకుంటానని నమ్మించిన రమణకి పంపించేది. 2017లో ఇద్దరూ ఉంగరాలు కూడా మార్చుకున్నారు. అయితే ఇటీవల ఆమె పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడంతో అతడు ఒప్పుకోలేదు.
దీంతో ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు రమణని స్టేషన్ కి పిలిపించి సహజీవనం చేయడంతో పెళ్లి చేసుకోమని సూచించడంతో గుడిలో తాళికట్టాడు. అదేరోజు రాత్రి పారిపోయాడు.
తెల్లవారుజామున ఫోన్ చేసి నువ్ నాకొద్దు విడాకులు తీసుకుందామని చెప్పాడు. దీంతో షాక్ అయిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను మోసగించిన రమణపై చర్యలు తీసుకోవాలని కోరింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.