అందుకు రాజమౌళి చరణ్ కి పర్మిషన్ ఇచ్చారా?
ఆచార్య మూవీలో చరణ్ నటిస్తున్నారా లేదా అనేది టాలీవుడ్ లో మిలియన్ డాలర్ ప్రశ్నగా ఉంది. చరణ్ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పూర్తి చేయాల్సివుండగా దీనిపై స్పష్టత వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తో రెండుసార్లు వెండితెరపై కనిపించడం జరిగింది. పాలిటిక్స్ కోసం బ్రేక్ తీసుకున్న చిరు 2009లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మగధీర సినిమాలో క్యామియో రోల్ చేశారు. మగధీర కోసం మొదటిసారి చిరు-చరణ్ వెండితెరపై కలిసి కనిపించారు. తరువాత 2015లో విడుదలైన బ్రూస్ లీ చిత్రంలో చిరు కనిపించడం జరిగింది. ఐతే వీరిద్దరూ పూర్తి స్థాయిలో ఓ మల్టీస్టారర్ చేస్తే చూడాలని ఫ్యాన్స్ ఎప్పటి నుండో కోరుకుంటున్నారు.
దర్శకుడు కొరటాల శివ ఆ కలను సాకారం చేయడానికి పూనుకున్నారు. చిరుతో ఆయన తెరకెక్కిస్తున్న ఆచార్య మూవీలో ఓ కీలక రోల్ చరణ్ కోసం ఆయన రాసుకున్నారు. దాదాపు 30నిముషాలకు పైగా నిడివి కలిగిన పాత్ర కోసం చరణ్ ని కొరటాల అనుకున్నారు. ఐతే అప్పటికే ఆర్ ఆర్ ఆర్ మూవీ షూటింగ్ లో నిమగ్నమైన చరణ్ డేట్స్ దొరకడం కష్టం కావచ్చని ఆయన భావించి, రాజమౌళికి సమాచారం ఇచ్చారు. అప్పటి పరిస్థితుల రీత్యా రాజమౌళి ఒకే చెప్పడం జరిగింది.
ఐతే లాక్ డౌన్ కారణంగా అందరి ప్రణాళిక తారుమారయ్యాయి. దీనితో ఆచార్యలో చరణ్ నటించడం జరగని పని అని అందరూ నిర్ణయించుకున్నారు. ఐతే ఆచార్యలో చరణ్ నటించడం ఖాయమే అంటున్నారు. చరణ్ పార్ట్ పూర్తి చేసేలా కొరటాల శివ షూటింగ్ సిద్ధం చేస్తున్నారట. రాజమౌళి సైతం దీనికి పర్మిషన్ ఇచ్చారట. ఎక్కువ నిడివి కలిగిన పాత్రలతో చరణ్, చిరును వెండితెరపై చూడాలని చిరంజీవి భార్య సురేఖ కోరిక. కావున ప్రతికూలతల మధ్య కూడా చరణ్ ఆచార్య కోసం సమయం కేటాయించారట.