డబ్బులు అడిగితే చంపేస్తాం అంటున్నారు... దాసరి కుమారులపై క్రిమినల్ కేసు!
మరో వివాదంలో దాసరి కుమారులు చిక్కుకున్నారు. డబ్బులు చెల్లించమని అడిగితే చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ పోలీసులకు వారిపై ఫిర్యాదు చేశారు.
దిగ్గజ దర్శకులు దాసరి నారాయణరావు టాలీవుడ్ కి పెద్ద దిక్కుగా అనేక మంది సమస్యలు తీర్చారు. పరిశ్రమకు గాని, పరిశ్రమలోని వ్యక్తులకు గాని ఎటువంటి సమస్య వచ్చినా మధ్యవర్తిగా సమస్యకు పరిష్కారం చూపించేవారు. ఆయన మరణానంతరం ఆయన కుటుంబంలోనే అనేక వివాదాలు, గొడవలు చోటు చేసుకోవడం విచారకరం.
ఆ మధ్య ఆస్తుల విషయంలో దాసరి కుమారులు అరుణ్, ప్రభు మధ్య గొడవలు జరిగాయి. వీరి పంచాయితీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. పరిశ్రమ పెద్దల చొరవతో ఆ గొడవ సద్దుమణిగినట్లు సమాచారం. తాజాగా మరో వివాదంలో దాసరి కుమారులు చిక్కుకున్నారు. డబ్బులు చెల్లించమని అడిగితే చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ పోలీసులకు వారిపై ఫిర్యాదు చేశారు.
వివరాలలోకి వెళితే గుంటూరుకి చెందిన అట్లూరి సోమశేఖర్ దాసరికి చాలా సన్నిహితుడు. దాసరి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఆయన పలు దఫాలుగా రూ. 2.10 అప్పుగా ఇవ్వడం జరిగింది. దాసరి మరణం తరువాత పెద్దల సమక్షంలో అసలు ఇవ్వాల్సి మొత్తానికి బదులు రూ. 1.15 కోట్లు ఇవ్వడానికి అరుణ్, ప్రభు ఒప్పుకున్నారు. ఒప్పందం ప్రకారం డబ్బులు చెల్లించకపోవడంతో సోమశేక ఈనెల 27న జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 46లో గల దాసరి నివాసానికి వెళ్లి డబ్బులు చెల్లించాలని అడిగారు.
అయితే డబ్బులు చెల్లించడానికి నిరాకరించిన దాసరి కుమారులు ప్రభు, అరుణ్, చెంపేస్తామంటూ బెదిరించారని సోమశేఖర్ ఆరోపిస్తున్నారు. సోమశేఖర్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం.