సారాంశం

కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం ‘కేజీఎఫ్ 2’ (KGF 2). ముఖ్యంగా బాలీవుడ్ లోనూ దుమ్మురేపింది. అలాంటి సినిమాపై ఓ బాలీవుడ్ డైరెక్టర్ చేసిన కామెంట్స్ ను తాజాగా రామ్ గోపాల్ వర్మ రివీల్ చేశాడు. 

దర్శకుడు ప్రశాంత్ నీల్ - కన్నడ స్టార్ హీరో యష్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘కేజీఎఫ్ 2’. ఈ చిత్రం ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే రెస్పాన్స్ దక్కించుకున్న ఈ యాక్షన్ ఫిల్మ్, అటు బాక్సాఫీస్ నూ షేక్ చేసింది. ఏకంగా రూ.1,200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన మూడో ఇండియన్ ఫిల్మ్ గా రికార్డు క్రియేట్ చేసింది. కన్నడ ఇండస్ట్రీలోనైతే కనివిని ఎరుగని రికార్డును నెలకొల్పింది. ఈ చిత్రాన్ని ఇప్పటికీ ప్రముఖులు ప్రశంసిస్తూనే ఉంటారు. అలాంది ఓ బాలీవుడ్ డైరెక్టర్ ‘కేజీఎఫ్ 2’పై ఎలా స్పందించాడో తాజాగా సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) తెలిపారు. 

తాజాగా ఆర్జీవీ మాట్లాడుతూ.. బాలీవుడ్ లో చాలా పెద్ద దర్శకుడికి ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ అస్సలు నచ్చలేదు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం అద్భుతమైన ప్రదర్శన చూసి బాలీవుడ్‌లోని చాలా మంది ఆశ్చర్యపోయారు కానీ, ఆ దర్శకుడు మాత్రం షాకింగ్ గా కామెంట్స్ చేశారు. రాము, నేను 5 సార్లు మూవీ చూడటానికి ప్రయత్నించాను, కానీ అరగంటకు మించి చూడలేకపోతున్నాని అన్నారన్నారు. ఆ తర్వాత తన తదుపరి చిత్రం స్క్రిప్ట్ వర్క్ లో బిజీ అయ్యారన్నారు. అయితే ఎవరైనా కంటెంట్ తోవాదించవచ్చు, కానీ విజయంపై వాదించలేరు. మనకు నచ్చినా, నచ్చకపోయినా కేజీఎఫ్ ఛాప్టర్ 2 బాలీవుడ్ ను భయపెట్టిందని రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. 

గతంలోనూ ఆర్జీవీ చిత్ర యూనిట్ ను అభినందించారు. బడ్జెట్ ను సినిమా నిర్మాణ నైపుణ్యాన్ని పెంచేదిగా ఉండాలని తెలిపారు. అనవసరంగా ఆర్టిస్టుల రెమ్యూనరేషన్ పై ఖర్చు చేస్తే మంచి సినిమాలు రావన్నారు. ‘కేజీఎఫ్’ చిత్ర నిర్మాణతల పనితీరును మెచ్చుకున్నారు. ఇక రామ్ గోపాల్ వర్మ ఎప్పటికప్పుడు తనదైన శైలిలో ఇలా స్పందిస్తూ నెట్టింట సందడి చేస్తూనే ఉన్నారు. ‘కేజీఎఫ్’లో యష్, శ్రీనిధి హీరోహీరోయిన్లుగా నటించారు. సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ కీలక పాత్రల్లో నటించారు.