మెగా హీరోలకు మీనుంచి నటన నేర్చుకునే ఖర్మ పట్టలేదు
- నంది అవార్డుల ఎంపికపై బన్నీవాస్ ఆగ్రహం
- మెగా హీరోలకు సర్కారు దగ్గర నటన నేర్చుకునే ఖర్మ లేదన్న వాసు
- కమర్షియల్ హిట్స్ ఇచ్చిన బన్నీకి సహాయనటుడు అవార్డుపై ఆవేదన
ఆంధ్రప్రదేశ్ సర్కారు నంది అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డుల ఎంపిక విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగలేదని... అత్యంత పారదదర్శకంగా ఎంపిక ప్రక్రియ నిర్వహించామని కూడా సర్కారు స్పష్టంచేసింది. మొత్తం మూడేళ్లకు 2014, 2015, 2016లకు గానూ నంది అవార్డులను ప్రభుత్వం ప్రకటించగా... ఈ అవార్డుల ఎంపిక సక్రమంగా జరగలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
తాజాగా నంది అవార్డుల విషయంలో మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీకి తీరని అన్యాయం జరిగిందని ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ సన్నిహితుడిగా వున్న బన్నీ వాసు ఆవేదన వ్యక్తం చేశాడు. గీతా ఆర్ట్స్ సంస్థలో బన్నీ వాసు కీలకమైన వ్యక్తి. ఏపీ ప్రభుత్వం మూడేళ్లకు ప్రకటించిన నంది అవార్డుల్లో మెగా కుటుంబానికి చెందిన ఒక్క హీరోకు కూడా ఉత్తమ నటుడు అవార్డు రాలేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.
ఈ మూడేళ్ల కాలంలో మెగా హీరోలు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారన్నాడు. రెండు కమర్షియల్ హిట్స్ ఇచ్చిన అల్లు అర్జున్కు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డు ఇవ్వడం హాస్యాస్పదమని ప్రశ్నించాడు. ఇది ముమ్మాటికీ మెగా ఫ్యామిలీని అవమానించడమేనని అన్నాడు. మెగా ఫ్యామిలీ ఈ విషయాన్ని పట్టించుకోలేదని, కానీ ఆవేదనతోనే తాను ప్రశ్నిస్తున్నానని వ్యాఖ్యానించాడు.
మగధీర సినిమాకు కూడా గతంలో తీరని అన్యాయం జరిగిందని... జాతీయ స్థాయిలో ఈ సినిమాకు గుర్తింపు లభించినా, రాష్ట్ర స్థాయిలో మాత్రం గుర్తింపు దక్కలేదని బన్నీ వాసు వాపోయాడు. ఈ మూడేళ్ల అవార్డుల గురించి మాత్రమే తాను మాట్లాడటం లేదని... చిరంజీవి కుటుంబానికి గత కొన్నేళ్లుగా అన్యాయం జరుగుతోందని చెప్పాడు. గత పదిహేనేళ్లుగా సినీ పరిశ్రమకు 50 శాతం ఆదాయం మెగా ఫ్యామిలీ నుంచే వస్తోందని తెలిపాడు. దీనిపై నిర్మాతల మండలి, ఫిలిం ఛాంబర్ స్పందించాలని కోరాడు.