తితిలి బాధితుల కోసం బన్నీ మరో సాయం!
శ్రీకాకుళం వాసుల కోసం అల్లు అర్జున్ గతంలోనే 25 లక్షల సహాయం ప్రకటించగా మరోసారి సాయం చేసి తన ఉదారతను చాటుకున్నాడు.
ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం ను తితిలి తుపాను తీవ్ర నష్టానికి గురి చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ లో తుపాను ధాటికి చాలా ప్రాంతాలు ఇంకా కోలుకోలేని పరిస్థితి. పలు గ్రామాల్లో మంచి నీరు కూడా దొరకడం కష్టంగా ఉంది. అయితే తుపాను బాధితుల కోసం సినీ తారలు సహాయాన్ని అందించిన సంగతి తెలిసిందే.
ఇక శ్రీకాకుళం వాసుల కోసం అల్లు అర్జున్ గతంలోనే 25 లక్షల సహాయం ప్రకటించగా మరోసారి సాయం చేసి తన ఉదారతను చాటుకున్నాడు. మంచి పని కోసం మరో అడుగు వేసి తీవ్రంగా నష్టపోయిన 4 గ్రామాల్లో 3 RO వాటర్ ప్లాంట్స్ ను అలాగే 1 బోర్ వెల్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టాడు. ఈ వాటర్ ప్లాంట్స్ పనులు పూర్తయితే శ్రీకాకుళం జిల్లాలో దాదాపు 3000 వేల మందికి మంచి నీరు లభిస్తుంది.
అందుకు సంబందించిన పనుల త్వరగా పూర్తి చేయాలనీ అధికారులను కోరారు. ఇక అభిమానులు స్టయిలిష్ స్టార్ చేసిన మంచి పనికి ప్రశంసలతో అభినందిస్తున్నారు.