'అవెంజర్స్' లాంటి మూవీస్ ఎందుకు తీయలేకున్నాం.. రాజమౌళిపై కరణ్ జోహార్ ఆసక్తికర వ్యాఖ్యలు
దర్శకధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రంతో వరల్డ్ వైడ్ గా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఇంకా కొనసాగుతోంది. ప్రపంచ దేశాల సినీ అభిమానులు ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఎలాంటి నీరాజనాలు పట్టారో చూశాం.

దర్శకధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రంతో వరల్డ్ వైడ్ గా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఇంకా కొనసాగుతోంది. ప్రపంచ దేశాల సినీ అభిమానులు ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఎలాంటి నీరాజనాలు పట్టారో చూశాం. ఇప్పుడు జక్కన్న సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ వరల్డ్ ప్రాజెక్టు తెరకెక్కించేందుకు కసరత్తు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా రాజమౌళి గురించి బాలీవుడ్ మొత్తం ప్రస్తుతం మాట్లాడుకుంటోంది. సౌత్ సినిమా బాలీవుడ్ ని దాటిపోయింది అంటే అందుకు కారణం రాజమౌళి వేసిన బాటే అని చెప్పొచ్చు. ఇదిలా ఉండగా బాలీవుడ్ లో భారీ చిత్రాల నిర్మాత కరణ్ జోహార్ కి రాజమౌళితో మంచి అనుబంధం ఉంది.
బాహుబలి చిత్రాన్ని కరణ్ జోహార్ హిందీలో తన ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లో రిలీజ్ చేశారు. అలాగే ఆర్ఆర్ఆర్ చిత్ర హిందీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కరణ్ జోహార్ హోస్ట్ గా చేశారు. తాజాగా కరణ్ జోహార్ రాజమౌళి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో కరణ్ జోహార్ పాల్గొనగా.. యాంకర్ ఆయన్ని ఇండియన్ సినిమాలో గేమ్ ఆఫ్ థ్రోన్స్, అవెంజర్స్ లాంటి భారీ ప్రాజెక్ట్స్ ఎందుకు రావడం లేదు ? అలాంటి చిత్రాలు మనం తీయలేమా ? మన దగ్గర అంత బడ్జెట్ లేదా? అని ప్రశ్నించారు.
దీనికి కరణ్ జోహార్ బదులిస్తూ.. మన దగ్గర అంత డబ్బు లేక కాదు.. కానీ ఇండియాలో ఒక్క రాజమౌళి మాత్రమే ఉన్నాడు' అంటూ ప్రశంసలు కురిపించాడు. అవెంజర్స్ లాంటి చిత్రాలు నిర్మించడానికి మనకి బడ్జెట్ సమస్య లేదు. కానీ మనకి రాజమౌళి లాంటి దర్శకులు ఎక్కువమంది కావాలి. అప్పుడే అలాంటి చిత్రాలు ఇండియన్ సినిమాలో ఎక్కువగా వస్తాయి అని సమాధానం ఇచ్చారు. కరణ్ జోహార్ లాంటి నిర్మాత రాజమౌళికి అంతటి ప్రాధాన్యత ఇవ్వడం తెలుగు సినిమాకి గర్వకారణం అని చెప్పొచ్చు.
ప్రస్తుతం జక్కన్న మహేష్ బాబుతో ఫారెస్ట్ నేపథ్యంలో సాగే ఒక వీరుడి కథని తెరక్కించబోతున్నారు. మరికొన్ని నెలల్లో ఈ చిత్రం ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.