బాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ గేయ రచయిత నాసిర్ ఫరాజ్ కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు.
వరుస మరణాలు భారతీయ చలన చిత్ర పరిశ్రమను కృంగదీస్తున్నాయి. గత ఏడాది టాలీవుడ్ లెజెండ్స్ కృష్ణంరాజు, కృష్ణ, కైకాల సత్యనారాయణ మరణించారు. తాజాగా బాలీవుడ్ ఫేమస్ లిరిసిస్ట్ నాసిర్ ఫరాజ్ హఠాన్మరణం పొందారు. ఆదివారం నాసర్ ఫరాజ్ గుండెనొప్పికి గురయ్యారు. ఆయన్ని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. 86ఏళ్ల నాసిర్ సోమవారం మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
పలు బాలీవుడ్ చిత్రాలకు గేయాలు రాసిన నాసిర్ ఫరాజ్ కొంతకాలంగా గుండె జబ్బుతో బాధపడుతున్నారు. ఓ ఏడేళ్ల క్రితం ఆయనకు హార్ట్ సర్జరీ జరిగిందని సమాచారం. అప్పటి నుండి ఆయన చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా ఆయనకు గుండెపోటు రావడం మరణానికి దారితీసింది.
నాసిర్ ఫరాజ్ 2010లో హృతిక్ రోషన్ నటించిన ‘కైట్స్’ మూవీలో ‘దిల్ క్యున్ మేరా షోర్ కరే’, ‘జిందగీ దో పాల్ కీ’ అనే సూపర్ హిట్ పాటలను రాశారు. అలాగే ‘బాజీరావ్ మస్తానీ’, ‘క్రిష్’, ‘కాబిల్’ చిత్రాలకు పాటలు కూడా స్వరపరిచారు. నాసిర్ ఫరాజ్ 'తుమ్ ముజే బస్ యున్ హై', 'మై హూన్ వో అస్మాన్', 'కోయి తుమ్సా నహీ', 'కాబిల్ హూన్' 'చోరీ చోరీ చుప్కే' వంటి హృదయాలను హత్తుకునే పాటలను రాశారు, అతని అకాల మరణం చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది.
