నటుడు ముకుల్‌ దేవ్‌ అనారోగ్యంతో ముంబయిలో మృతిచెందారు. తెలుగు సహా పలు భాషల్లో విలన్‌గా నటించిన ఆయన 2022 నుంచి సినిమాలకు దూరంగా ఉన్నారు.

తెలుగు, హిందీ సినీ ప్రేక్షకులకు తెలిసిన నటుడు ముకుల్‌ దేవ్‌ ఇకలేరు. 54 ఏళ్ల ముకుల్‌ దేవ్‌ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ ముంబయిలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో శుక్రవారం రాత్రి ఆయన మరణించారు. ఈ వార్తను కుటుంబ సభ్యులు, అతడి సన్నిహితులు ధృవీకరించారు.

టీవీ సీరియల్స్‌ ద్వారా తన నటనకు ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ముకుల్‌ తర్వాత హిందీ సినిమాల వైపు మొగ్గుచూపాడు. 1996లో వచ్చిన దస్తక్‌ అనే సినిమా ద్వారా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఆయన, తన అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగు ప్రేక్షకులకు ముకుల్‌ దేవ్‌ పేరు పరిచయం కావడానికి కారణం రవితేజతో వచ్చిన "కృష్ణ" సినిమాలో విలన్ పాత్రే. ఆ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన, తర్వాత "కేడి", "అదుర్స్", "సిద్ధం", "నిప్పు", "భాయ్" లాంటి చిత్రాల్లో కీలక పాత్రలు చేశారు.

ప్రసిద్ధ నటుడు రాహుల్‌ దేవ్‌ సోదరుడిగా కూడా ముకుల్‌కు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. పంజాబీ, కన్నడ సినిమాల్లోనూ ఆయన నటించారు. 2022లో వచ్చిన "అంత్ ది ఎండ్" సినిమానే ఆయన చివరి చిత్రం. ఆ తర్వాత ఆరోగ్య సమస్యల కారణంగా సినిమా రంగానికి దూరంగా ఉన్నారు.

అనేక భాషల్లో విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న ముకుల్‌ దేవ్‌ చనిపోయిన వార్త సినీ ప్రముఖుల మధ్య విషాదాన్ని నెలకొల్పింది.