సాయిధరమ్ తేజ్ ప్రమాదంలో కొత్త కోణం.. బైక్ రేసింగే కొంప ముంచిందా?
పోలీసుల విచారణలో కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. బైక్ రేసింగ్ వల్లే సాయితేజ్ ప్రమాదానికి గురయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. సాయితేజ్ బైక్పై బయలుదేరడానికి ముందు నటుడు నరేష్ ఇంటికెళ్లారు. నరేష్ తనయుడు నవీన్ విజయ్ కృష్ణ, సాయితేజ్ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు.
మెగా హీరో సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఐసీయూలో ఆయనకు ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, వైద్యులు తెలిపారు. సాయితేజ్ కోలుకున్నాక ఆయన్ని విచారించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే పోలీసుల విచారణలో కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. బైక్ రేసింగ్ వల్లే సాయితేజ్ ప్రమాదానికి గురయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
సాయితేజ్ బైక్పై బయలుదేరడానికి ముందు నటుడు నరేష్ ఇంటికెళ్లారు. నరేష్ తనయుడు నవీన్ విజయ్ కృష్ణ, సాయితేజ్ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. శుక్రవారం కూడా వీరిద్దరు కలిసి బైక్ రేసింగ్కి బయలు దేరారని, ఇద్దరి మధ్య పోటీ పెట్టుకోవడంతో సాయితేజ్ అతివేగంగా వెళ్తూ ప్రమాదానికి గురయ్యారని సమాచారం. రేసింగ్ వల్లే సాయితేజ్ బైక్ ప్రమాదానికి గురైందని అనుమానిస్తున్న పోలీసులు ఆ కోణంలో విచారణ జరుపుతున్నారు. సీసీటీవీ ఫుటేజీలో కూడా రెండు ద్విచక్రవాహనాలు వేగంగా వెళ్తున్నట్లు కనిపిస్తోంది.
శుక్రవారం రాత్రి 7 గంటల 58 నిమిషాలకు సాయితేజ్ దుర్గం చెరువు కేబుల్ బ్రడ్జిపై వెళ్తున్నట్లు సీసీటీవీలో రికార్డు అయింది. 8 గంటలకు కోహినూర్ హోటల్ దాటి ఐకియా వైపు దూసుకెళ్లారు. ఆ తర్వాత కొద్ది సేపటికే 8 గంటల 5 నిమిషాలకు బైక్ అదుపుతప్పి సాయితేజ్ కిందపడ్డారు. ప్రమాదానికి గురైన సాయితేజ్ను రాత్రి 8 గంటల 26 నిమిషాలకు స్థానికంగా ఉన్న మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు అనుమానిస్తున్నట్టు సాయితేజ్, నవీన్ విజయ్ కృష్ణల మధ్య బైక్ రేసింగ్ పోటీనే కొంప ముంచి ఉండొచ్చని తెలుస్తుంది. మరి దీనిపై పోలీసులు లోతైన విచారణ జరిపితే అసలు విషయాలు బయటకు వస్తాయి.
సాయితేజ్పై రాయదుర్గం పోలీసులు ఇప్పటికే ఐపీసీ 336, మోటర్ వెహికల్ యాక్ట్ 184 కింద రెండు కేసులు నమోదు చేశారు. ఇక ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన బైక్ రైసింగ్ వ్యవహారంపై మాదాపూర్ డీసీపీ దర్యాప్తు చేస్తున్నారు.