`భోళాశంకర్` ట్రైలర్..మెగా ఫెస్టివల్ షురూ.. బ్యాక్ టూ బ్యాక్ అన్నాదమ్ముల రచ్చ..
ఇప్పటికే మెగా సందడి ప్రారంభమైంది. ఇక మరో నాలుగు రోజుల నుంచి మెగా ఫెస్టివల్ షురూ కాబోతుంది. చిరంజీవి నటించిన `భోళా శంకర్` ట్రైలర్ అప్ డేట్ ఇచ్చింది యూనిట్.

మెగాస్టార్ మరోసారి సందడి చేయడానికి వస్తున్నారు. ఆయన ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతికి `వాల్తేర్ వీరయ్య`తో ఫ్యాన్స్ కి మాత్రమే కాదు బాక్సాఫీసుకి కూడా పూనకాలు తెప్పించారు. ఈ సినిమా రూ.250కోట్లకుపైగా కలెక్షన్లని సాధించింది. నిర్మాతలకు దాదాపు యాభై కోట్ల లాభాలను తెచ్చిపెట్టింది. ఇప్పుడు మరోసారి రచ్చ చేసేందుకు వస్తున్నారు మెగాస్టార్. ప్రస్తుతం ఆయన `భోళాశంకర్` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.
మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభించారు మేకర్స్. మూడు పాటలు విడుదల చేశారు. టీజర్తో అదరగొట్టారు. ఇప్పుడు మరో అప్డేట్ వచ్చింది. ట్రైలర్ టైమ్ వచ్చింది. ఈ నెల 27న `భోళాశంకర్` ట్రైలర్ని విడుదల చేయబోతున్నట్టు టీమ్ తెలిపింది. మరో నాలుగు రోజుల్లో మెగా ఫెస్టివల్ ప్రారంభం కాబోతుందని యూనిట్ తెలిపింది.
మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని రూపొందిస్తున్నారు మెహర్ రమేష్. ఇది తమిళంలో విజయం సాధించిన `వేదాళం` చిత్రానికి రీమేక్ అనే విషయం తెలిసిందే. తమన్నా కథానాయికగా నటిస్తుండగా, కీర్తిసురేష్ చెల్లి పాత్ర పోషిస్తుంది. అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆగస్ట్ 11న విడుదల కాబోతుంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల జోరుపెంచారు. ఇక ట్రైలర్ అది మరింత పెరగబోతుంది.
అయితే బ్యాక్ టూ బ్యాక్ మెగా బ్రదర్స్ రచ్చ చేయబోతున్నారు. నిన్న శనివారం పవన్ కళ్యాణ్ నటించిన `బ్రో` ట్రైలర్ రిలీజ్ అయ్యింది. పవర్ స్టార్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. రెండు రోజుల్లో `బ్రో` ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. మరో రెండు రోజుల్లో `భోళాశంకర్` ట్రైలర్ రానుంది. ఆ నెక్ట్స్ డేనే `బ్రో` సినిమా రిలీజ్ కానుంది. ఆ తర్వాత వరుసగా చిరంజీవి ప్రమోషన్స్ లో సందడి చేయనున్నారు. మధ్యలో ఒక్క వారం గ్యాప్ తో `భోళాశంకర్` రానుంది. ఇలా మెగా ఫెస్టివల్ షురూ కాబోతుందని చెప్పొచ్చు.