Bhagyashree: 'మైనే ప్యార్ కియా' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిన భాగ్యశ్రీ, తన పర్సనల్ లైఫ్లో జరిగిన ఓ బాధాకరమైన సంఘటనను గుర్తుచేసుకుంది. తన లవ్ లెటర్స్ ని పేరెంట్స్ కాల్చేశారట.
తొలి చిత్రంతోనే ఓవర్ నైట్లో స్టార్ అయిన భాగ్యశ్రీ
హీరోయిన్గా నటించిన తొలి చిత్రంతోనే ఓవర్ నైట్లో స్టార్ అయిపోయింది భాగ్యశ్రీ. ఆమె బాలీవుడ్లో `మైనే ప్యార్ కియా` చిత్రంలో నటించింది. ఇందులో సల్మాన్ సరసన రొమాన్స్ చేసింది. ఈసినిమా పెద్ద హిట్ అవ్వడంతో భాగ్యశ్రీ విశేషమైన గుర్తింపుని తెచ్చుకుంది. బాలీవుడ్లో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో మెరిసిన ఆమె ఆ మధ్య తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి `రాధేశ్యామ్`లో నటించింది. ఇందులో ప్రభాస్కి అమ్మ పాత్రలో మెరిసింది.
లవ్ లెటర్స్ కాల్చేసిన ఘటన చెప్పిన భాగ్యశ్రీ
ఈ క్రమంలో భాగ్యశ్రీ తన వ్యక్తిగత జీవితంలోని ఓ బాధాకరమైన సంఘటనను పంచుకుంది. తన కళ్ల ముందే పేరెంట్స్ తన లవ్ లెటర్స్ను కాల్చేసిన విషయాన్ని గుర్తుచేసుకుని ఎమోషనల్ అయింది. 'మైనే ప్యార్ కియా' సినిమా చూసినప్పుడల్లా సల్మాన్ ఖాన్, భాగ్యశ్రీ జోడీని ఆడియెన్స్ గుర్తు చేసుకుంటారు.
హిమాలయ దాసానిని పెళ్లి చేసుకోవడం వెనుక కథ
ఈ సినిమా తర్వాత ఆమె చాలా ఏళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉంది. దీనికి కారణం ఆమె లవ్ లైఫ్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె దీనిపై స్పందించింది. ఇంట్లో వాళ్ల వ్యతిరేకతను తట్టుకుని హిమాలయ దాసానిని ఎలా పెళ్లి చేసుకుందో ఆమె వెల్లడించింది. భాగ్యశ్రీ, హిమాలయ దాసాని స్కూల్ రోజుల్లోనే కలిశారు. అది 'లవ్ ఎట్ ఫస్ట్ సైట్' కాదని, 'ఫైట్ ఎట్ ఫస్ట్ సైట్' అని ఆమె సరదాగా చెబుతుంది. నెమ్మదిగా వాళ్లిద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది.
భాగ్యశ్రీ ప్రేమని వ్యతిరేకించిన పేరెంట్స్
ఇద్దరి మధ్య ప్రేమ పెరిగాక, భాగ్యశ్రీ ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. అప్పుడు వాళ్లు, 'నువ్వు ప్రేమించడానికి ఇంకా చిన్నపిల్లవి, చదువు మీద దృష్టి పెట్టు' అని చెప్పారు. కుటుంబం మాట విని ఇద్దరూ దూరమయ్యారు. ఈ టైంలో భాగ్యశ్రీ కాలేజీ, సినిమాలతో బిజీ అవ్వగా, హిమాలయ పైచదువుల కోసం విదేశాలకు వెళ్లాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఇద్దరూ మళ్లీ కలిసినప్పుడు, వాళ్ల మధ్య పాత ఫీలింగ్స్ మళ్లీ చిగురించాయి.
పేరెంట్స్ కోసం ప్రియుడిని ద్వేషించిన భాగ్యశ్రీ
కానీ ఈసారి కూడా వాళ్ల కుటుంబం ఈ రిలేషన్ని వ్యతిరేకించింది. 'హిమాలయకు నీపై ద్వేషం పుట్టేలా ఈ బంధాన్ని తెంచుకో' అని ఆమె తల్లిదండ్రులు చెప్పారు. ఫ్యామిలీ మాట విని భాగ్యశ్రీ, 'నేను నీ ముఖం మళ్లీ చూడాలనుకోవడం లేదు' అని హిమాలయకు చెప్పింది. ఇది ఆమెకు చాలా కష్టమైన నిర్ణయం. ఏడాది పాటు తాము చెప్పినట్టు వింటే, తను ఇష్టపడ్డ అబ్బాయికే పెళ్లి చేస్తామని తల్లిదండ్రులు మాట ఇచ్చారు.
ప్రేమలేఖల్ని కాల్చేయడం
ఈ మొత్తం ఘటనలో అత్యంత బాధాకరమైన క్షణం ఏంటంటే, వాళ్లిద్దరి మధ్య ఉన్న ప్రేమలేఖలన్నింటినీ ఆమె కళ్ల ముందే తల్లిదండ్రులు కాల్చేయడం. ఆ రాత్రి తను చాలా ఏడ్చానని, ఆ లెటర్స్తో పాటు తన కలలు, భావాలు కూడా కాలిపోయాయని భాగ్యశ్రీ చెప్పింది. ఆమెకు ఆ ఉత్తరాలు కేవలం కాగితాలు కాదు, అవి జ్ఞాపకాలు, ప్రేమకు చిహ్నాలు. కానీ నిజమైన ప్రేమ ఎప్పటికీ ఆగదు అంటారు కదా, అలాగే భాగ్యశ్రీ, హిమాలయ ఒకరినొకరు వదులుకోలేకపోయారు.
లేచిపోయి పెళ్లి చేసుకున్న భాగ్యశ్రీ
ఎన్ని ప్రయత్నాలు చేసినా విడిపోలేక, చివరికి ఇంట్లో నుంచి బయటకు వచ్చి పెళ్లి చేసుకున్నారు. తల్లిదండ్రుల ఆశీర్వాదం లేకుండా పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని భాగ్యశ్రీ చెప్పింది. అయినా, కుటుంబం ఈ బంధాన్ని ఒప్పుకోకపోవడంతో, ఒకరోజు వాళ్ల కాళ్లకు నమస్కరించి ఇంట్లోంచి బయటకు వచ్చేసింది. తన మొదటి బ్లాక్బస్టర్ సినిమా 'మైనే ప్యార్ కియా' విడుదలైన తర్వాత, ఓ గుడిలో హిమాలయను పెళ్లి చేసుకుంది. జనవరి 19, 1989న ఈ ఇద్దరు ఒక్కటయ్యారు.


