చిన్న సినిమాలకు మాత్రం ఓటీటీలు అనుకూలంగా లేవని అంటున్నారు నిర్మాత అర్జున్‌ దాస్యం. పెద్ద సినిమాలనే తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారని, చిన్న సినిమాలను పట్టించుకోవడం లేదన్నారు.

`ఓటీటీ`లు వచ్చాక నిర్మాతలు ఊపిరిపీల్చుకుంటున్నారు. చిన్నా,పెద్ద చిత్రాలకు ఓటీటీలు మినిమమ్‌ గ్యారంటీగా మారాయి. థియేట్రికల్‌గా కలెక్షన్లు వచ్చినా, రాకపోయినా సగం వరకు ఓటీటీ రైట్స్ ద్వారా నిర్మాతలకు రికవరీ అవుతుంది. దీనికి థియేట్రికల్‌ యాడ్‌ అవుతున్న నేపథ్యంలో నిర్మాత సేఫ్‌లో ఉంటున్నారు. ఈ భరోసాతోనే ఇప్పుడు నిర్మాతలు సినిమాలు నిర్మిస్తున్నారు. కరోనా కారణంగా ఊపందుకున్న ఓటీటీలు చిత్ర పరిశ్రమకి పెద్ద ఊరటనిచ్చే అంశంగా నిలిచింది. కానీ ఇప్పుడు సీన్‌ మారిందట. ఒకప్పటి పరిస్థితి లేదని అంటున్నారు `భాగ్‌ సాలే` నిర్మాత అర్జున్‌ దాస్యన్‌. 

తమ సినిమా మంచి రేటుకే బిజినెస్‌ అయ్యిందని, కంటెంట్‌ కారణంగా, కాస్టింగ్ కారణంగా తమ సినిమా ఓటీటీ రైట్స్ ప్రముఖ సంస్థ దక్కించుకుందని చెప్పారు. అయితే చిన్న సినిమాలకు మాత్రం ఓటీటీలు అనుకూలంగా లేవని అంటున్నారు. పెద్ద సినిమాలనే తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారని, చిన్న సినిమాలను పట్టించుకోవడం లేదన్నారు. థియేటర్లలో జనాలు రావడం కష్టమైన నేపథ్యంలో ఓటీటీలైనా చిన్న సినిమాలను బతికిస్తున్నాయని భావించాం, కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయిందన్నారు. చాలా వరకు ఓటీటీలు సొంతంగా సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు తీసుకుంటున్నాయని, కొనాల్సి వస్తే పెద్ద సినిమాలనే కొంటున్నాయని, దీంతో అటు థియేటర్లలో ఆడియెన్స్ రాక, ఇటు ఓటీటీలు కొనక ఎటూ కాకుండా అయిపోతుందన్నారు. ఇకపై నిర్మాతలు చాలా ఆచితూచి సినిమాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు నిర్మాత. 

శ్రీసింహా కోడూరి హీరోగా నటిస్తున్న సినిమా `భాగ్ సాలే`. నేహా సోలంకి నాయికగా నటించింది. ప్రణీత్ బ్రాహ్మాండపల్లి దర్శకత్వంలో క్రైమ్ కామెడీ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ నిర్మాతగా.. బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ అసోసియేషన్ తో అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మించారు. జూలై 7న `భాగ్ సాలే` రిలీజ్‌కు రెడీ అవుతోంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా నిర్మాత మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఓటీటీలకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అర్జున్‌ దాస్యన్‌. 

ఇక `భాగ్‌ సాలే` సినిమా గురించి ఆయన చెబుతూ, `ప్రణీత్ కథ చెప్పినప్పుడు చాలా బాగా అనిపించింది. కానీ భయమేసింది. మొదటి కాపీ చూసిన తరువాత నేను అనుకున్న దానికంటే పది రెట్లు ఎక్కువగా తీశాడు దర్శకుడు. హీరో శ్రీసింహాకు ఈ జోనర్‌ బాగా సెట్ అవుతుంది. అతని మొదటి సినిమా `మత్తువదలరా` కూడా మంచి విజయం సాధించింది. ఈ సినిమా కూడా అంతే హిట్ అవుతుందని భావిస్తున్నాం. సినిమాలో హీరో పేరు అర్జున్. సులభంగా ఎదగాలనే అనుకునే కుర్రాడు. ఈ క్రమంలో మోసాలు చేయడం.. ఎదురయ్యే సమస్యలపై హీరో పాత్ర ఉంటుంది. ఓ రింగ్ ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తుంది. ఇటీవల ది వరల్డ్ ఆఫ్ భాగ్ సాలే పేరుతో ఒక యానిమేషన్ వీడియో విడుదల చేశాం. దీనికి సిద్దూ జొన్నలగడ్డ వాయిస్ అందించారు. ఈ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓ కథలా చెప్పాం. మొత్తం సినిమా ఈ రింగ్ చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా కల్పితమే.

కేవలం కామెడీ తీస్తేనే బాగోదని.. క్రైమ్ జోనర్‌ను కూడా ఎంచుకున్నాం. ఇప్పటికే కొన్ని టీవీ షోలలో ప్లాస్టిక్ కామెడీ చేస్తున్నారు. సినిమాలలో కూడా అలాంటి కామెడీనే చూపించడం ఎందుకు అనిపించింది. సినిమాలో క్రైమ్, కామెడీ రెండు సమానంగా ఉంటాయి. మంచిగా నవ్వుకుంటూనే సినిమా సాగుతుంది. ప్రేక్షకులు సినిమా అంతా నవ్వుకునే సీన్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే క్రైమ్ కూడా సాగుతుంటుంది. `స్వామి రారా` సినిమా తరహాలో ఉంటుంది. జాన్ విజయ్ గారు విలన్‌గా నటించారు. మా ప్రొడక్షన్ నుంచి ఇది మూడో సినిమా. `డియర్ మేఘా` సినిమాను కన్నడ రీమేక్‌గా తీశాం. కానీ సినిమా విడుదల రోజే వాళ్లు యూట్యూబ్‌లో చేశారు. దాని వల్ల మా సినిమాకు నష్టం వచ్చింది. చాలా మంచి సినిమా అది. తరువాత మళ్లీ రీమేక్స్ చేయకూడదని అనుకున్నా. ప్రస్తుతం తెలుగు రచయితలతో చేస్తున్నా. హిందీలో అక్కడి రచయితలతో పనిచేస్తున్నాం. కాళ భైరవ మ్యూజిక్‌,పాటలు సినిమాకి పెద్ద అసెట్‌ అవుతాయి` అని తెలిపారు నిర్మాత అర్జున్‌ దాస్యన్‌.