ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్‌ ఈవెంట్ వేదికపై క్లారిటీ వచ్చింది. ఒంగోల్ ఏబీఎమ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌‌కు పోలీసులు అనుమతి నిరాకరించడంతో..  వేదిక విషయంలో చివరి నిమిషంలో మార్పులు జరిగాయి. 

ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్‌ ఈవెంట్ వేదికపై క్లారిటీ వచ్చింది. తొలుత వీరసింహారెడ్డి ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను జనవరి 6 తేదీ ఒంగోలులోని ఏబీఎమ్ గ్రౌండ్స్‌లో నిర్వహించాలని చిత్ర యూనిట్ భావించింది. అందుకు సంబంధించి ఏర్పాట్లు చేసుకోంది. సోషల్ మీడియాలో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌‌కు సంబంధించిన సమాచారాన్ని అందజేసింది. అయితే ఏపీ సర్కార్ ఇటీవల తీసుకొచ్చిన జీవో నేపథ్యంలో ఏబీఎమ్ కాలేజ్ గ్రౌండ్స్‌లో వీరసింహారెడ్డి ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు పోలీసులు అధికారులు నిరాకరించారు. ప్రత్యామ్నాయ స్థలాన్ని చూసుకోవాలని చిత్ర యూనిట్‌కు సూచించారు.

దీంతో వీరసింహారెడ్డి ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ వేదిక విషయంలో చివరి నిమిషంలో మార్పులు జరిగాయి. ఒంగోలులోనే వీరసింహారెడ్డి ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించనుండగా.. వేదికను మాత్రం మార్చారు. ఈవెంట్ నిర్వాహకులు పలు స్థలాలను జాబితా చేయగా.. అర్జున్ ఇన్ఫ్రా (బీఎంఆర్ మహానాడు గ్రౌండ్) దగ్గర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ జరుపుకునేందుకు పోలీసుల నుంచి అనుమతి కూడా లభించినట్టుగా తెలుస్తోంది. దీంతో నిర్వాహకులు శరవేగంగా పనులను పూర్తిచేస్తున్నారు. మరోవైపు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు వచ్చేవారి వాహనాల పార్కింగ్‌‌కు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. 

రేపు సాయంత్రం అక్కడే బాలకృష్ణ వీరసింహారెడ్డి ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌కు హీరో బాలకృష్ణ, దర్శకుడు గోపిచంద్ మలినేనితో పాటు చిత్ర యూనిట్ హాజరుకానుంది. ఈ వేడుకకు భారీగా నందమూరి అభిమానులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. 

ఇక, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన వీరసింహారెడ్డి చిత్రానికి బాలయ్యకి జోడీగా శృతి హాసన్ నటించింది. జనవరి 12న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. ఇప్పటికే విడుదలైన పాటలు అభిమానుల్ని అలరిస్తున్నాయి. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమా వస్తోంది. ఈ సినిమాలో విలన్ గా దునియా విజయ్ కనిపించనున్నాడు. రామ్ లక్ష్మణ్ ఫైట్స్ .. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఈ సినిమాకి హైలైట్‌గా నిలవనున్నాయని అంటున్నారు. నందమూరి అభిమానులంతా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.