అన్న హరికృష్ణని గుర్తు చేసుకుంటూ బాలకృష్ణ ఎమోషనల్ పోస్ట్
నందమూరి హరికృష్ణకి.. తమ్ముడు, హీరో బాలకృష్ణ నివాళ్లు అర్పించారు. హరికృష్ణ వర్థంతి సందర్భంగా ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు బాలయ్య.
నటుడు, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణకి ఆయన వర్థంతి సందర్భంగా తమ్ముడు, హీరో నందమూరి బాలకృష్ణ నివాళ్లు అర్పించారు. నాలుగేళ్ల క్రితం హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన విషయం తెలిసిందే. నేడు(ఆగస్ట్ 29) వర్థంతి సందర్భాన్ని పురస్కరించుకుని బాలయ్య అన్నయ్యని గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ద్వారా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
ఇందులో బాలకృష్ణ చెబుతూ, `మా అన్న నందమూరి హరికృష్ణ గారి వర్థంతి సందర్భంగా ఆ మహానుభావుడికి నా ఘన నివాళ్లు. తన కోసం కంటే నాన్నగారి ఆశయాల కోసం ఎంతో కష్టపడ్డారు. నాన్నగారి కోసం సైనికుడిలా పనిచేసిన చైతన్య రథసారధి. తెలుగు వాడి కోసం పార్లమెంట్లో గర్జించిన నిజమైన తెలుగువాడు. ఈ రోజు ఆయన మా మధ్య లేకపోయినా ఆయన జ్ఞాపకాలు ఎప్పుడు మాతోనే ఉంటాయి. నువ్వు ఎప్పుడూ మాతోనే ఉన్నావు, మాలోనే ఉన్నావు హరన్న. నందమూరి హరికృష్ణ అమర్ రహే` అంటూ బాలయ్య భావోద్వేగ పోస్ట్ ని పంచుకున్నారు.
ఈ సందర్భంగా అరుదైన ఫోటోలను పంచుకున్నారు బాలకృష్ణ. ఎన్టీఆర్ రాజకీయ ప్రచారంలో చైతన్య రథ సారధిగా ఉన్నప్పటి హరికృష్ణ ఫోటోలను షేర్ చేశారు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హరికృష్ణ 2018 ఆగస్ట్ 29 నల్గొండ హైవేపై రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన విషయం తెలిసిందే. తన స్నేహితుడి ఇంట్లో ఫంక్షన్ నిమిత్తం ఆయన తనే స్వయంగా కారు నడుపుతూ వెళ్తున్నారు. ఈ క్రమంలో కారు అదుపుతప్పి డివైడర్ని ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలపాలైన హరికృష్ణ ఆసుపత్రికి తరలించే క్రమంలోనే తుదిశ్వాస విడిచారు. అంతకు నాలుగేండ్ల ముందే అదే నల్గొండ హైవేపై పెద్ద కుమారుడు జానకీ రామ్ కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే.
హరికృష్ణకి ముగ్గురు కుమారులు జానకీరామ్, కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్. జానకీరామ్ నిర్మాతగా రాణించారు. కళ్యాణ్ రామ్ హీరోగా, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై సినిమాలు నిర్మిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా రాణిస్తున్న విషయం తెలిసిందే. హరికృష్ణ రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. ఎన్టీఆర్ వారసత్వాన్ని పునికి పుచ్చుకుని అటు రాజకీయాల్లో, ఇటు సినిమా రంగంలోనూ రాణించారు. ఆయన హీరోగా పలు బ్లాక్ బస్టర్స్ లో భాగమయ్యారు.