తారకరత్న పేరుతో ఉచితంగా గుండె సమస్యలకు చికిత్స.. జై బాలయ్య అంటూ అలేఖ్య రెడ్డి ఎమోషనల్ పోస్ట్
నందమూరి తారకరత్న మరణించి నెలరోజులు గడచిపోయింది. అంతా ఒక కలలా జరిగిపోయిందని అభిమానులు భావిస్తున్నారు. ఈ షాక్ నుంచి కుటుంబ సభ్యులు ఇంకా తేరుకోలేదు.

నందమూరి తారకరత్న మరణించి నెలరోజులు గడచిపోయింది. అంతా ఒక కలలా జరిగిపోయిందని అభిమానులు భావిస్తున్నారు. ఈ షాక్ నుంచి కుటుంబ సభ్యులు ఇంకా తేరుకోలేదు. నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా తారకరత్న జనవరిలో గొండెపోటుకి గురైన సంగతి తెలిసిందే. దాదాపు 23 రోజులు మృత్యువుతో పోరాడిన తారకరత్న చివరకి గత నెల ఫిబ్రవరి 22న తుదిశ్వాస విడిచారు.
కొడుకుతో సమానమైన తారకరత్న వైద్యం, మరణించిన తర్వాత కార్యక్రమాలన్నీ బాలయ్య దగ్గరుండి చూసుకున్నారు. తారకరత్న ఫ్యామిలీకి ప్రస్తుతం బాలకృష్ణ పెద్ద దిక్కుగా మారారు. బాలకృష్ణ ముక్కుసూటిగా ఉండే వ్యక్తి అని అందరికి తెలుసు. ఎంత ఆగ్రహంతో ఉంటారో.. అంతే బంగారు మనసు కూడా బాలయ్యది. ఈ విషయాన్ని అభిమానులు, సన్నిహితులు పలు సందర్భాల్లో తెలిపారు.
తాజాగా బాలకృష్ణ తన మంచి మనసు చాటుకుంటూ గొప్ప పని చేశారు. తారకరత్న జ్ఞాపకార్థం హృద్యసమస్యలతో బాధపడుతున్న వారికి ఉచిత వైద్యం అందించాలని బాలయ్య నిర్ణయం తీసుకున్నారు. హృదయ సమస్యలు ఎంత ప్రమాదకరమో తారకరత్న విషయంలో బాలకృష్ణ దగ్గరుండి గమనించారు. గుండె సమస్యలతో బాధపడుతూ చికిత్స ఖర్చులు భరించలేని పేదవారికి పూర్తి ఉచితంగా వైద్యం అందించబోతున్నట్లు బాలకృష్ణ ప్రకటించారు. ఈ మేరకు బసవతారకం ఆసుపత్రిలో ఒక బ్లాక్ కి తారకరత్న బ్లాక్ అని నామకరణం చేశారు.
గుండె సమస్యలకు ఉచిత వైద్యం బసవతారకం ఆసుపత్రితో పాటు, హిందూపురంలో బాలయ్య నిర్మించే ఆసుపత్రిలో కూడా అందుబాటులో ఉంటుంది. దీనితో బాలయ్య పై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. మరోసారి బాలయ్య తన బంగారు మనసు చాటుకున్నారు అంటూ అభిమానులు కీర్తిస్తున్నారు.
బాలయ్య చేసిన ఈ గొప్ప ప్రకటనపై తారకరత్న సతీమణి అలేఖ్య రెడ్డి కూడా స్పందించారు. బాలకృష్ణ గురించి అలేఖ్య రెడ్డి పోస్ట్ పెడుతూ.. నేనేం మాట్లాడగలను.. మిమ్మల్ని బంగారు బాలయ్య అని పిలవడంతో ఎలాంటి ఆశ్చర్యం లేదు. మీరు మాకు తండ్రి, స్నేహితుడి కన్నా ఎక్కువ.. ఇప్పుడు మీలో దేవుడిని చూస్తున్నా. మీ గొప్ప మనసు చూసి నాకు మాటలు రావడం లేదు. జై బాలయ్య.. జై జై బాలయ్య అంటూ అలేఖ్య రెడ్డి పోస్ట్ పెట్టారు.