బలగం సినిమాలో కీలక పాత్ర పోషించిన నటుడు జీవీ బాబు అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ చిత్రంలో హీరో ప్రియదర్శికి తాత పాత్ర అయిన అంజన్నగా జీవీ బాబు నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 

ప్రముఖ కమెడియన్ వేణు దర్శకత్వం వహించిన బ్లాక్‌బస్టర్ సినిమా బలగం. ఈ సినిమాలో ప్రముఖ పాత్ర పోషించిన నటుడు జీవీ బాబు కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నా ఆయన పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. బాబు మరణంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

జీవీ బాబు కిడ్నీలు దెబ్బతినడం, గొంతు ఇన్‌ఫెక్షన్‌ వంటి సమస్యలతో వరంగల్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. మౌనం తప్ప ఎలాంటి స్పందన తెలియజేయలేని స్థితిలో ఆయన ఉండేవారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. దీర్ఘకాలికంగా డయాలసిస్ తీసుకుంటున్న ఆయనకు ఆసుపత్రి ఖర్చులు భరించలేని స్థితి ఏర్పడింది.

ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న జీవీ బాబు కుటుంబానికి ‘బలగం’ దర్శకుడు వేణు, హీరో ప్రియదర్శి తదితరులు తమకు తోచినంత మేర ఆర్థిక సహాయం అందించారు. కుటుంబ సభ్యులు మందులు కొనలేని స్థితిలో ఉండటంతో సినీ రంగం నుండి మరింత సహాయం కోసం రిక్వెస్ట్ కూడా చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలంటూ వేడుకున్నారు.

జీవీ బాబు మృతి పట్ల దర్శకుడు వేణు స్పందించారు. ఎక్స్ వేదికగా ఆయన ఓ పోస్ట్ ను షేర్ చేశారు. బాబు జీవితాంతం నాటకరంగానికి అంకితమై జీవించారు. ఆయన్ను బలగం ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేసే అవకాశం రావడం నాకు గర్వకారణం అని తెలిపారు. పలువురు సినీ ప్రముఖులు కూడా బాబు మృతిపట్ల సంతాపం ప్రకటించారు.

రెండేళ్ల క్రితం విడుదలైన బలగం సినిమా తెలుగులో గ్రామీణ భావోద్వేగాలతో ప్రేక్షకులను ఆకట్టుకుని ఘన విజయం సాధించింది. ఇందులో జీవీ బాబు నటించిన అంజన్న పాత్ర బలగం సినిమా కథను ముందుకు తీసుకెళ్లడంలో కీలకంగా నిలిచింది. పల్లె తాతగా ఆయన సహజమైన నటనకు ప్రశంసలు లభించాయి.

గత కొద్దికాలంలో ‘బలగం’ చిత్రంలో నటించిన మరో నటుడు మోగిలయ్య కూడా అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. అంతకు ముందు కూడా సర్పంచ్ పాత్రలో నటించిన వ్యక్తి కూడా మరణించారు. దీంతో ఒకే చిత్రానికి చెందిన ప్రముఖుల వరుస మరణాలు ఇండస్ట్రీలో విషాదం నింపాయి.