శర్వానంద్ కి షాకిచ్చిన బాహుబలి నిర్మాతలు
- ‘మహానుభావుడు’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శర్వానంద్
- భారీ విజయం దిశగా దూసుకెళ్తున్న మహానుభావుడు
- ఆరంభంలోనే సమస్యలు ఎదుర్కొంటున్నశర్వానంద్ కొత్త చిత్రం
ప్రస్తుతం తెలుగులో ఉన్న యంగ్ హీరోల్లో వరుస హిట్లతో దూసుకుపోతున్న యువ నటుడు శర్వానంద్. ఆయన నటించిన తాజా చిత్రం ‘మహానుభావుడు’ ఇటీవల విడేదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మెహరీన్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.
ఆ సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్న శర్వానంద్.. మరో రెండు చిత్రాలకు ఒకే చెప్పేశాడట. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి, అలానే సుధీర్ వర్మలతో కలిసి సినిమాలు చేయబోతున్నట్లు ఇటీవల శర్వా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ప్రకాష్ కోవెలమూడి డైరెక్ట్ చేయబోయే చిత్రాన్ని బాహుబలి చిత్ర నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలు కలిసి నిర్మించబోతున్నారనే ప్రచారం జరిగింది. భారీ బడ్జెట్తో రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని అనుకున్నారు.
కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి శోభు, ప్రసాద్లు తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. కారణాలు బయటకు రానప్పటికీ.. ఈ సినిమాను ప్రీప్రొడక్షన్ స్టేజ్లో నిలిపివేసినట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కోసం లొకేషన్స్ను కూడా ఫైనల్ చేసుకున్న దర్శకుడు ప్రకాష్, శర్వానంద్ లు అయోమయంలో పడిపోయారట.
మరో నిర్మాతతో సినిమాని తెరకెక్కిస్తారా లేదా సినిమాని వాయిదా వేస్తారా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా.. మరికొద్ది రోజుల్లో శర్వా, సుధీర్ వర్మ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో శర్వా రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడని టాక్.