`బేబీ`సినిమా విషయంలో అటు చిత్ర దర్శకుడు సాయి రాజేష్‌, మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ మధ్య వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు సాయి రాజేష్‌.

`బేబీ` మూవీ విషయంలో చిత్ర దర్శకుడు సాయి రాజేష్‌కి, హీరో విశ్వక్‌ సేన్‌కి మధ్య వివాదం దుమారం రేపిన విషయం తెలిసిందే. `బేబీ` సక్సెస్‌ ఈవెంట్‌లో ముందు ఓ హీరో ఈ కథని వినేందుకు కూడా ఇష్టపడలేదంటూ సాయిరాజేష్‌ చేసిన వ్యాఖ్యలకు విశ్వక్‌ సేన్‌ హర్ట్ అయ్యాడు. దీంతో ఓ సినిమా ఈవెంట్‌లో దానికి విశ్వక్‌ సేన్‌ కౌంటర్ ఇవ్వడంతో ఆ వివాదం మరింత రాజుకుంది. అది పెద్ద హాట్‌ టాపిక్‌గా మారింది. 

తాజాగా దీనిపై `బేబీ` డైరెక్టర్‌ సాయి రాజేష్‌ స్పందించారు. ఓ(రియల్ టాక్‌ విత్‌ అంజి) యూట్యూబ్‌ ఇంటర్వ్యూలో ఆయన ముచ్చటించారు. విశ్వక్‌ సేన్‌ వివాదానికి సంబంధించిన ప్రశ్న రావడంతో ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మళ్లీ ఈ వివాదాన్ని పెద్దది చేయడం తనకు ఇష్టం లేదని, అసలు ఆయన్ని తాను సంప్రదించలేదని, గీతా ఆర్ట్స్ ద్వారా విశ్వక్‌ సేన్‌ని సంప్రదించారని తెలిపారు. అయితే ఆయన రియాక్ట్ అయిన తీరుని యదాతథంగా తనకు చెప్పారని, ఫిల్టర్‌ చేసి ఉంటే బాగుండేదని, విశ్వక్‌ సేన్‌ ఏమని చెప్పాడో అదే తనకు చెప్పడంతో బాధ అనిపించిందన్నారు. 

`నో` చెప్పడానికి కూడా ఓ పద్ధతి ఉంటుందని, అలా కాకుండా ఆయన చెప్పిన విధానం తనకు బాధ కలిగించిందన్నారు సాయి రాజేష్‌. అదే సమయంలో తనకు అది మంచే జరిగిందన్నారు. విశ్వక్‌ సేన పరిస్థితిని తాను అర్థం చేసుకోగలను. కొత్తవాళ్లని ఎందుకు నమ్మాలనేది కూడా ఉంటుంది, తన ప్రయారిటీ లిస్ట్ లో నేను ఉండకపోవచ్చు అని చెప్పారు.నేను కూడా ఏ రోజు ఆయన్ని ఒక్క మాట కూడా అనలేదు, ఇన్‌సల్ట్ చేయలేదు. ఆనంద్‌ గురించి చెప్పే క్రమంలో విశ్వక్‌ గురించి చెప్పాల్సి వచ్చిందన్నారు. 

ఇన్ని జరుగుతున్నా కూడా ఆనంద్‌ దేవరకొండ తనని నమ్మాడని, ఆయనకు కథ కూడా సరిగా చెప్పలేదని, చాలా చెత్తగా స్టోరీ చెబుతానని, అలాంటిది తనని నమ్మాడని చెప్పాను. అయితే కొత్తవాళ్లు ఆకలి మీద, కసి మీద, పెయిన్ మీద ఉంటారు. అలాంటి వారికి రిజెక్షన్‌ రెస్పెక్టబుల్‌గా ఉంటే బాగుంటుందని తాను అభిప్రాయపడుతున్నట్టు చెప్పారు. విశ్వక్‌కి తనకు మధ్య వ్యక్తిగతంగా ఏం లేదని ఓ పార్టీకి వెళ్లినప్పుడు అతనే అన్నాడు పాట అదరగొట్టిందని, కానీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో నేను ఏదో అనడం వల్ల, మీమ్స్ పేజీలను చూసి తాను ట్వీట్‌ వేయడం, ఇదంతా జరిగిందని, కానీ ఇది జరగకుండా ఉండాల్సిందన్నారు. 

ఈ సందర్భంగా విశ్వక్‌ సేన్‌కి చేసిన సహాయాన్ని బయటపెట్టారు సాయి రాజేష్‌. విశ్వక్‌ మొదటి సినిమా `వెళ్లిపోమాకే`. ఆ సినిమా ఆగిపోయింది. దీంతో ఆ ట్రైలర్‌ నచ్చి అటు అల్లు అరవింద్ కి, ఇటు దిల్‌రాజుకి చూపించి, దాన్ని ప్రోత్సహించాలని తాను తీసుకున్నట్టు చెప్పారు. అలా దిల్‌రాజు ఆ సినిమాని రిలీజ్‌ చేశారని వెల్లడించారు. ఈ విషయం ఇప్పటి వరకు విశ్వక్‌ సేన్‌కి కూడా తెలియదన్నారు సాయిరాజేష్‌.