పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన `హరిహర వీరమల్లు` చిత్రం నుంచి మూడో పాట `అసుర హననం` బుధవారం హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ పాటకి విశేష స్పందన లభిస్తుంది.
పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చారిత్రాత్మక మూవీ `హరిహర వీరమల్లు`. ఇందులో పవన్ చారిత్రాత్మక యోధుడు వీరమల్లుగా నటిస్తున్నారు. జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది.
నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఈ మూవీ జూన్ 12న విడుదల కాబోతుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాల స్పీడ్ పెంచింది టీమ్. అందులో భాగంగా తాజాగా ఇందులోని మూడో పాటని విడుదల చేశారు.
వీరమల్లు పోరాటాన్ని ఆవిష్కరించిన `అసుర హననం`..
`అసుర హననం` అంటూ సాగే ఈ పాటని భారీ ఈవెంట్ ఏర్పాటు చేసి విడుదల చేశారు. ప్రమోషన్స్ ని స్టార్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ పాత్ర తీరుతెన్నులను, ఆయన హీరోయిజాన్ని ఆవిష్కరించేలా ఈ పాట సాగడం విశేషం. యోధుడిగా ఆయన్ని ఈ పాటలో చూపించిన తీరు అదిరిపోయింది.
అదే సమయంలో సినిమా కాన్సెప్ట్ ని కూడా ఇందులో చెప్పే ప్రయత్నం చేశారు మేకర్స్. రాజులు ప్రజలను చిత్ర హింసలు పెడుతుండగా, వారిని ఎదురించి, అమాయక జనం కోసం పోరాడే పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నట్టుగా ఈ పాటలో చూపించారు. ఇది పవర్ స్టార్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా ఉంది. సినిమాో కథలో భాగంగా ఈ పాట వస్తుందని అర్థమవుతుంది.
రోమాలు నిక్కబొడిచేలా పాటకి కీరవాణి సంగీతం
ఇక విడుదలైన `అసుర హననం` పాటకి ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. రాంబాబు గోశాల ఈ పాటని రాయడం విశేషం. ఐరా ఉడుపి, కాలభైరవ, సాయి చరణ్ భాస్కరుని, లోకేశ్వర్ ఈదర, హైమత్ మహ్మద్ తమ గాత్రంతో పాటని వేరే స్థాయికి తీసుకెళ్లారు. 'అసుర హననం' గీతం రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది.
అసురులపై పోరాడుతున్న యోధుడి వీరత్వాన్ని చాటిచెప్పేలా సంగీతం, సాహిత్యం ఉన్నాయి. శ్రోతలలో పోరాట స్ఫూర్తిని రగిల్చేలా శక్తివంతంగా కీరవాణి సంగీతం ఉండటం విశేషం. తెలుగుతోపాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలోనూ ఈ పాటని ఏక కాలంలో విడుదల చేశారు.
పవన్ కళ్యాణ్ ఆగని ఒక కార్చిచ్చుః కీరవాణి
ఇక పాట విడుదల సందర్భంగా కీరవాణి మాట్లాడుతూ, `హరి హర వీరమల్లు` సినిమాతో నా ప్రయాణం ఐదేళ్ల క్రితం రాధాకృష్ణ(క్రిష్)తో మొదలైంది, ఇప్పుడు జ్యోతికృష్ణతో పూర్తవుతుంది. నేను చాలామంది దర్శకులను చూశాను. కానీ, తక్కువమందిలో ఉండే అరుదైన క్వాలిటీ జ్యోతిలో ఉంది. వేగంగా నిర్ణయం తీసుకుంటాడు, ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాడు.
ఎడిటింగ్, గ్రాఫిక్స్, మ్యూజిక్ అన్ని పనులు ఒక్కడే చూసుకుంటూ నిద్రాహారాలు మాని ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు. ఇండస్ట్రీలో వివాద రహితుడిగా ఎ.ఎం. రత్నంకి పేరుంది. లిరిక్ రైటర్ గా ఆయనకు నేను పెద్ద ఫ్యాన్ ని.
ఈ సినిమా రూపంలో ఎ.ఎం. రత్నం గారికి మరో భారీ విజయం సొంతం అవుతుందని విశ్వసిస్తున్నాను. అలాగే నిర్మాత దయాకర్ గారంటే నాకెంతో గౌరవం. ఈ సినిమాలో ఆయన పాత్ర ఎంతో ఉంది. రాంబాబు లాంటి మంచి గీత రచయితను నాకు జ్యోతికృష్ణ పరిచయం చేశారు. నిధి అగర్వాల్ తన పాత్రను చక్కగా పోషించింది.
పవన్ కళ్యాణ్ ని మీరందరూ పవర్ స్టార్ అంటారు. నేను మూర్తీభవించిన ధర్మాగ్రహం అంటాను. ఆగ్రహం మనందరికీ వస్తుంది. కానీ సమాజం కోసం వచ్చేది ధర్మాగ్రహం. ఆయనకు మాత్రమే సరిపోయేలా 'హరి హర వీరమల్లు'ను తీర్చిదిద్దారు. జయాపజయాలతో సంబంధం లేకుండా దూసుకుపోయే కార్చిచ్చు పవన్ కళ్యాణ్. కార్చిచ్చు మీద ఎంత వాన పడినా అది ఆగదు. ఆయనతో మొదటిసారి చేస్తున్న సినిమా కాబట్టి ఎంతో శ్రద్ధతో చేశాను` అని తెలిపారు కీరవాణి.
`హరిహర వీరమల్లు` సినిమాకు పవన్ కారణంః ఏఎం రత్నం
నిర్మాత ఎ.ఎం. రత్నం మాట్లాడుతూ, `ఐదు సంవత్సరాలు ఎంతో కష్టపడి ఈ సినిమా తీశాము. సినిమా ఫీల్డ్ లో నా ప్రయాణం 54 ఏళ్ళు. తెలుగు, తమిళ, హిందీ అన్ని భాషల్లో సినిమాలు తీశాను. 90 శాతానికి పైగా నా సినిమాలు విజయం సాధించాయి. సినిమా ద్వారా వినోదంతో పాటు, ఏదో ఒక సందేశం ఇవ్వాలనేది నా తపన. `భారతీయుడు`, `ఒకే ఒక్కడు` లాంటి సినిమాలు అందించాను.
`హరి హర వీరమల్లు` సినిమా తయారవ్వడానికి ముఖ్యకారణం పవన్ కళ్యాణ్. క్రిష్ చెప్పిన కథ నచ్చి, పవన్ కళ్యాణ్ దగ్గరకు తీసుకెళ్ళాను. రత్నం జడ్జిమెంట్ ను నమ్మి ఈ సినిమా చేస్తున్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు. కొన్ని కారణాల వల్ల సినిమా ఆలస్యమైంది. నా కుమారుడు అని చెప్పడం కాదు.. జ్యోతికృష్ణ ఈ సినిమా బాధ్యతను తీసుకొని ఎంతో కష్టపడి పని చేశాడు.
ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి సినిమాని పూర్తి చేశాడు. సినిమా అద్భుతంగా వచ్చింది. తెలుగుతో పాటు అన్ని భాషల్లో విజయం సాధిస్తుందని నమ్ముతున్నా` అని తెలిపారు ఏఎం రత్నం.
కత్తికి, ధర్మానికి మధ్య జరిగే యుద్ధమే `హరిహర వీరమల్లు`ః జ్యోతికృష్ణ
చిత్ర దర్శకుడు జ్యోతి కృష్ణ మాట్లాడుతూ, `పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేయాలని ప్రతి దర్శకుడికి కల ఉంటుంది. అది ఒక అవార్డు గెలుచుకున్నట్టుగా ఉంటుంది. నాకు ఈ అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. మొదట ఈ ప్రాజెక్ట్ కి పెద్ద పునాది వేసింది క్రిష్. దానిని పెద్ద స్థాయికి తీసుకెళ్ళాలని నాన్నగారు ప్లాన్ చేశారు. ఇంత పెద్ద బాధ్యతను ఒలింపిక్ టార్చ్ లాగా క్రిష్ నాకు అందించి ముందుకు తీసుకెళ్ళమని చెప్పారు.
పవన్ కళ్యాణ్ ని, నాన్నని మెప్పించడం మామూలు విషయం కాదు. అలాంటిది ఆ ఇద్దరూ మెచ్చారంటే.. ఈ సినిమా థియేటర్లలో ఏ స్థాయి స్పందన సొంతం చేసుకోబోతుందో మీరే ఊహించుకోవచ్చు. కీరవాణితో పని చేయడం గర్వంగా ఉంది. రాంబాబుకి సందర్భం చెప్పి, పాట రాయించుకొని కీరవాణిని కలిస్తే.. సాహిత్యం బాగుందని మెచ్చుకున్నారు. నన్ను కూడా ఎంతో ప్రోత్సహించారు.
ఓ వైపు ప్రజాసేవ, మరోవైపు ఇచ్చిన మాట కోసం సినిమాలు చేస్తూ విశ్రాంతి తీసుకోకుండా పవన్ కళ్యాణ్ ఎంతో శ్రమిస్తున్నారు. ఒక గొప్ప సినిమాని ప్రేక్షకులకు అందించాలనే లక్ష్యంతో నాన్న మొదటి సినిమా నిర్మాతలా ఈ సినిమా కోసం పని చేశారు. కత్తికి, ధర్మానికి మధ్య జరిగే యుద్ధమే ఈ సినిమా` అని చెప్పారు. ఈ కార్యక్రమంలో నిధి అగర్వాల్, రైటర్ రాంబాబు గోశాల, రఘుబాబు, సింగర్స్, ఇతర టీమ్ పాల్గొంది.