తమిళ 'అర్జున్ రెడ్డి'.. విడుదల కష్టమే..!
తెలుగులో 'అర్జున్ రెడ్డి' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే.. దీంతో తమిళ, హిందీ భాషల్లో సినిమాను రీమేక్ చేశారు.
తెలుగులో 'అర్జున్ రెడ్డి' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే.. దీంతో తమిళ, హిందీ భాషల్లో సినిమాను రీమేక్ చేశారు. 'కబీర్ సింగ్' పేరుతో హిందీ రీమేక్ ఇటీవల విడుదలై పెద్ద సక్సెస్ అందుకుంది. రెండు వందల కోట్ల వసూళ్లతో దూసుకుపోతుంది.
ఇక తమిళ వెర్షన్ విషయానికొస్తే.. విక్రమ్ తనయుడు ధృవ్ ఈ రీమేక్ తో పరిచయం కావాల్సివుంది. ముందుగా దర్శకుడు బాలా డైరెక్షన్ లో 'వర్మ' అనే పేరుతో సినిమాను తెరకెక్కించారు.
అయితే సినిమా అవుట్ పుట్ విషయంలో నిర్మాతలు, విక్రమ్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఆ వెర్షన్ ని పక్కన పెట్టేసి డైరెక్టర్ ని మార్చి 'ఆదిత్య వర్మ' అనే టైటిల్ తో మరో వెర్షన్ రెడీ చేశారు. ఇటీవల టీజర్ కూడా వదిలారు. మళ్లీ అదే నెగెటివిటీ కంటిన్యూ అయింది. కొత్త వెర్షన్ ని పూర్తి చేసి జూన్ లో రిలీజ్ చేస్తామని ముందుగా అనౌన్స్ చేశారు.
అనుకున్నట్లుగా షూటింగ్ పూర్తైనప్పటికీ విడుదల చేసే సాహసం చేయలేకపోయారు. 'అర్జున్ రెడ్డి' కథ ధృవ్ కి సెట్ కాలేదని రెండో వెర్షన్ తీసేవరకు అర్ధం చేసుకోలేకపోయారు. సమస్య దర్శకులతో కాదని హీరోతో అని తెలుసుకొని సినిమాను పక్కన పెట్టాలని భావిస్తున్నారు.
ఈ సినిమా రిలీజ్ అయితే ధృవ్ కెరీర్ కి నష్టం తప్ప మరేమీ జరగదని విక్రమ్ కూడా భావిస్తున్నాడు. ఇప్పటివరకు నిర్మాతలు పెట్టిన ఖర్చు మొత్తం తిరిగిచ్చేసి సినిమాను ల్యాబ్ కే పరిమితం చేయాలని విక్రమ్ ఆలోచిస్తున్నాడట.