కీలకమైన కేసులో దాదాపు 9 ఏళ్ల తరువాత మెగాస్టార్ చిరంజీవికి ఊరట లభించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఆయనపై ఉన్న కేసును కొట్టివేసింది. ఇంతకీ ఏంటా కేసు.
టాలీవుడ్ మెగాస్టార్.. అప్పటి కాంగ్రెస్ నేత చిరంజీవికి హైకోర్టులో ఊరట లభించింది. 2014 ఆయన కాంగ్రేస్ లో ఉండగా జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చిరంజీవిపై పెట్టిన కేసును ఏపీ హైకోర్ట్ కొట్టేసింది. 9ఏళ్ళ క్రితం గుంటూరు, అరండల్ పేట పోలీసులు నమోదు చేసిన కేసును తాజాగా హైకోర్టు కొట్టివేసింది. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా గుంటూరు రైల్వే కోర్టులో జరుగుతున్న విచారణను నిలిపివేసింది. జరిమానా విధించాలన్న అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభ్యర్థనను తోసిపుచ్చింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే శ్రీనివాసరెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
2014ఎన్నికల సందర్భంగా చిరంజీవి ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా నియమాలు అతిక్రమించారని. రాత్రి 10 గంటల తరువాత ప్రచారం నిర్వహించకూడదు అనినియమం ఉన్నా కాని.. లెక్క చేయకుండా ప్రచారం నిర్వహించారని, ట్రాఫిక్ అంతరాయం కలిగించారని పేర్కొంటూ అప్పటి కాంగ్రెస్ నేత, సినీ హీరో చిరంజీవిపై గుంటూరు అరండల్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు చార్జ్షీట్ దాఖలు చేయగా గుంటూరు రైల్వే కోర్టులో విచారణ జరుగుతుంది.
అదే సమయంలో పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని, రైల్వే కోర్టులో విచారణ ప్రక్రియను నిలుపుదల చేయాలని కోరుతూ చిరంజీవి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు నిన్న (జులై25) విచారణకు వచ్చింది. మెగాస్టార్ తరఫున న్యాయవాది ఏ స్వరూపారెడ్డి వాదనలు వినిపించారు. వాదనలు విన్న హైకోర్ట్ ఈ విధంగా తీర్పు ఇచ్చింది.
కాగా, 2008లో ప్రజారాజ్యం పార్టీని పెట్టిన చిరంజీవి.. 2009లో ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. తర్వాత కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పని చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల వరకు పొలిటికల్గా చిరంజీవి యాక్టివ్ గానే ఉన్నారు. ఆ సమయంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు.అప్పట్లో కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ ఎంపీగా ఎన్నికై, ఆ తర్వాత కేంద్రమంత్రి కూడా అయిన చిరంజీవిని 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం ఆశల్లేని పరిర్థితుల్లో స్టార్ క్యాంపెయినర్గా ఎంపిక చేసి పంపింది. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన సినిమాలపైనే పూర్తిగా దృష్టి పెట్టారు.
