ఏపీలో సినీ ప్రియులకు గుడ్న్యూస్.. ఈ నెల 30 నుంచి థియేటర్ల ఓపెన్కి అనుమతి
ఈనెల 30 నుంచి రాష్ట్రంలో థియేటర్లు ఓపెన్ చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో సినీ ప్రియులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.
ఆంధ్ర ప్రదేశ్లోని సినీ అభిమానులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. థియేటర్ల ఓపెనింగ్ విషయంలో నెలకొన్నసస్పెన్స్ కి తెరదించింది. ఈనెల 30 నుంచి థియేటర్లు ఓపెన్ చేసుకునేందుకు అనుమతినిచ్చింది. దీంతో సినీ ప్రియులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. గత నాలుగు నెలలుగా సినిమా వినోదం కోసం వేచి చూస్తున్న అభిమానులకు ఊరటనిచ్చింది. అయితే అక్కడే చిన్న మెలిక పెట్టింది. యాభై శాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్లు రన్ చేయాలని, కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని వెల్లడించింది.
కరోనావైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ కారణంగా ఏపీ రాష్ట్రంలో థియేటర్లు చాలా రోజులుగా మూతపడే ఉన్నాయి. మధ్యలో కరోనా కాస్త తగ్గుముఖం పట్టిన తర్వాత థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చినప్పటికీ.. 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్ల నిర్వహణ తలకు మించిన భారం అవుతుందని సగానికిపైగా థియేటర్ల యజమానులు థియేటర్లు తెరిచేందుకు ముందుకురాలేదు. అంతలోనే కరోనా సెకండ్ వేవ్ రావడంతో తెరిచిన కొద్ది థియేటర్లు కూడా మళ్లీ మూతపడ్డాయి. ఎట్టకేలకు ఈ నెల 30 నుంచి థియేటర్లు ఓపెన్ కాబోతుండటంతో సినీ ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
దీంతో ఈ నెల 30 నుంచి విడుదల కాబోతున్న `తిమ్మరుసు`, `ఇష్క్` వంటి చిత్రాలు కూడా ఏపీలో విడుదల కానున్నాయి. తెలంగాణలో థియేటర్లు ఓపెన్ చేసుకునేందుకు చాలా రోజుల క్రితమే అనుమతినిచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఇటీవల పార్కింగ్ ఫీజు కూడా వసులు చేసుకునే వెసులుబాటుని అందించింది.