RIP Krishnam Raju: మీ సేవలు చిరస్మరణీయం... కృష్ణంరాజు మృతిపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
నటుడు కృష్ణంరాజు మృతిపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. నటుడిగా, నాయకుడిగా ఆయన సుదీర్ఘ కాలం సేవలందించారు. ఐదు దశాబ్దాలకు పైగా సాగిన నట ప్రస్థానం లో హీరో, విలన్, సైడ్ హీరో, సపోర్టింగ్, క్యారెక్టర్ రోల్స్ చేశారు. భిన్నమైన జోనర్స్ ట్రై చేశారు. తుది శ్వాస వరకు ఆయన నటనే ప్రాణంగా జీవించారు. 80 ఏళ్ల వయసులో రాధే శ్యామ్ చిత్రం చేశారు. ప్రభాస్ హీరోగా విడుదలైన రాధే శ్యామ్ కృష్ణంరాజు చివరి చిత్రం కావడం విశేషం.
కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణంరాజు సెప్టెంబర్ 11 తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఉదయం కుటుంబ సభ్యులు కృష్ణంరాజు మృతి చెందినట్లు వెల్లడించారు. కృషంరాజు మరణం పట్ల చిత్ర ప్రముఖులు, రాజకీయవేత్తలు, అభిమానులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కృష్ణంరాజు మృతికి సంతాపం ప్రకటించారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ''కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ నటులు కృష్ణంరాజు గారి మరణం బాధాకరం. నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయం. కృష్ణంరాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.'' అని ట్విట్టర్ లో సందేశం పోస్ట్ చేశారు.
ఇక తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో కృష్ణంరాజు అంత్యక్రియలు జరపనున్నట్లు ప్రకటించింది. 1940 జనవరి 20న జన్మించిన కృషంరాజు 1966లో విడుదలైన చిలకా గోరింకా చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. కెరీర్ లో 180కి పైగా చిత్రాల్లో ఆయన నటించారు. రెబల్ స్టార్ గా కృష్ణంరాజు మాస్ ఇమేజ్ తో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. చిరంజీవి, మహేష్ తో పాటు పలువురు కృష్ణంరాజుకు సంతాపం ప్రకటించారు.