‘పుష్ప’ లో పాత్ర గురించి అనసూయ ఇలా...
రంగస్థలం సినిమా తర్వాత అనసూయకు సినిమా అవకాశాలు భారీగానే వస్తున్నాయి. కానీ ఆమె మాత్రం వచ్చిన ప్రతి సినిమా ఒప్పుకోకుండా.. వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ నటిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది.
సుకుమార్ గత చిత్రం రంగస్థలంలో రంగమ్మత్తగా అందరికి ఆకట్టుకుంది అనసూయ. ప్రస్తుతం అల్లుఅర్జున్, సుకుమార్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’లోనూ కీలకపాత్ర పోషిస్తోంది అనసూయ. ఈ నేపధ్యంలో ఆమె పాత్ర ఎలా ఉండబోతోందనే ఆసక్తి కలగటం సహజం. అయితే పుష్పలో కూడా రంగమ్మత్త స్దాయిలోనే ప్రాధాన్యమున్న పాత్ర చేయబోతుందట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అనసూయ పుష్పలో తన క్యారెక్టర్ గురించి కొద్దిగా హింట్ ఇచ్చింది.
అనసూయ మాట్లాడుతూ.... పుష్పలో నా క్యారెక్టర్ ఏంటో చెప్పను కానీ, సినిమాకు మాత్రం ఆ పాత్ర చాలా కీలకం. సినిమాకి టర్నింగ్ పాయింట్ అయ్యేలా నా పాత్రను తీర్చిదిద్దాడు సుకుమార్. రంగమ్మత్త కంటే గొప్ప పాత్ర ఇందులో చేయబోతున్నాను’అని అనసూయ చెప్పుకొచ్చింది.తనని నమ్మి పుష్పలో అంత కీలకమైన పాత్ర అప్పగించినందుకు ఆయనకు ధాంక్స్ చెప్పుకుంటున్నాను అంది.
పుష్ప చిత్రం విషయాకొస్తే.. పాన్ ఇండియాలో స్థాయిలో దీనిని రూపొందిస్తున్నాడు దర్శకుడు సుకుమార్. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇందులో బన్నికి జోడిగా రష్మిక నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఫహద్ ఫజల్ విలన్గా కనిపించనున్నాడు. జగపతిబాబు, ప్రకాష్ రాజ్, సునీల్, ధనుంజయ్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఆగస్టు 13న విడుదల కానుందని ప్రకటించారు కానీ ఇప్పుడున్న పరిస్దితిల్లో వాయిదా పడుతుందని అంటున్నారు.
ఇక స్పెషల్ సాంగ్స్ లోనూ నటిస్తున్న అనసూయ ప్రస్తుతం`థాంక్స్ యు బ్రదర్` లో గర్భవతిగా కనిపిస్తోంది. ఈ మూవీ త్వరలోనే ఓటీటిలో విడుదల కాబోతోంది. ఇక కార్తికేయ నటించిన `చావు కబురు చల్లగా`లో ఒక ప్రత్యేక పాట చేసింది. అంతే కాకుండా మాస్ రాజా రవితేజ నటిస్తున్న `ఖలాడీ`లోనూ కీలక పాత్రలో కనిపించబోతోంది.