సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్గా నిలిచే యాంకర్ అనసూయ భరద్వాజ్.. తాజాగా రాజకీయాలపై స్పందించింది. తాను రాజకీయాలకు రావడంపై ఆమె రియాక్ట్ అయ్యింది.
బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్.. బుల్లితెరని వదిలేసి పెద్ద తెరపైనే బిజీ అవుతుంది. ఆమెకి పాపులారిటీని, గుర్తింపుని తెచ్చిన `జబర్దస్త్` షోని కూడా వదిలేసింది. ఇప్పుడు పూర్తిగా సినిమాలకే పరిమితమయ్యింది. వరుసగా సినిమాలతో మెప్పిస్తుంది. రెండు మూడు నెలలకు ఓ మూవీలో అయినా కనిపిస్తుంది. గత నెలలో `పెదకాపు`లో నటించింది. ఈ వారం `ప్రేమ విమానం` విడుదల కానుంది. త్వరలో `రజాకార్` మూవీ రాబోతుంది.
`రజాకార్` అనే చిత్రం నిజాం కాలంలో రాజాకార్ల ఆగడాలను ఇతివృత్తంగా చేసుకుని రూపుదిద్దుకుంది. ఇందులో ముఖ్య పాత్రలో అనసూయ నటిస్తుంది. ఈ సినిమా నుంచి `భారతీ భారతీ ఉయ్యాలో` అనే పాటని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆమె పాల్గొంది. ఇందులో రాజకీయాల్లోకి ఎప్పుడొస్తున్నారనే ప్రశ్న ఎదురైంది. ఈ సందర్భంగా అనసూయ రియాక్ట్ అయ్యింది. తనకు రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి లేదని స్పష్టం చేసింది. తాను ఎవరితోనూ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన చర్చలు జరుపలేదని వెల్లడించింది.
తనకు రాజకీయాలపై ఇంట్రెస్ట్ లేదని చెప్పిన అనసూయ.. సేవ చేయడానికి రాజకీయాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదని, నటిగా కూడా సేవ చేయొచ్చని తెలిపింది. అంతో ఇంతో, తనకు సాధ్యమైనంత నీటి బొట్టంతైనా తాను ఇప్పుడు చేసుకుంటూ వస్తున్నానని, అది కంటిన్యూ అవుతుందని చెప్పింది. రాజకీయాల్లోకి వెళ్లాలని తాను అనుకోవడం లేదని, తనకెవరూ ఆఫర్ చేయలేదని ఆమె వెల్లడించింది. బయట ఉండి కూడా చాలా ఉద్దరించొచ్చని చెప్పింది అనసూయ.
`రంగస్థలం` చిత్రం తర్వాత అనసూయ సినిమా కెరీర్ పెద్ద టర్న్ తీసుకుంది. ఆ సినిమాతో రంగమ్మత్తగా మెప్పించింది. ఇప్పటికీ అదే పేరుతో అనసూయని పిలుస్తుండటం విశేషం. ఆతర్వాత వరుసగా ఆమెకి సినిమా అవకాశాలొచ్చాయి. వస్తున్నాయి. కొన్ని ఐటెమ్ సాంగ్స్ కూడా చేసింది. బలమైన పాత్రలతో ఆడియెన్స్ ని ఎంటర్టైన్ చేయడమే తన లక్ష్యం అని అలాంటి పాత్రలే చేస్తానని తెలిపింది. ఈ క్రమంలో ఇటీవల `రంగమార్తాండ` చిత్రంతో ఆకట్టుకుంది. అలాగే `విమానం` చిత్రంలో వేశ్యగా కనిపించింది. `పెదకాపు`లో నాయకురాలిగా కనిపించింది. `ప్రేమ విమానం`లో పేదింటి ఇళ్లాలుగా కనిపిస్తుంది. ఇలా విలక్షణ పాత్రలతో మెప్పిస్తుంది.

