Akshay Kumar Corona: అక్షయ్ కుమార్కి కరోనా.. కేన్స్ టూర్ క్యాన్సిల్
బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ కి కరోనా సోకింది. తాజాగా ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ కి కరోనా సోకింది. తాజాగా ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. తాను ఈ సారి కేన్స్ లో పాల్గొనలేకపోతున్నానని, కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందన్నారు. ప్రస్తుతం రెస్ట్ లో ఉన్నట్టు చెప్పారు. అక్షయ్ కుమార్కి గతేడాది ఏప్రిల్ టైమ్లో కరోనా సోకింది. దాన్నుంచి ఆయన కోలుకున్నారు. ఇప్పుడు మరోసారి కోవిడ్ 19న నిర్దారణ కావడం గమనార్హం. నాల్గో వేవ్ కరోనా నెమ్మదిగా విజృంభిస్తుందనడానికిది సాంకేతాలుగా చెప్పొచ్చు.
అక్షయ్ కుమార్ ఈ సారి పారిస్లో జరిగే `కేన్స్ 2022` చలన చిత్రోత్సవ వేడుకలో పాల్గొనేందుకు ఆహ్వానం అందించింది. ఆయన ఆ వేడుకలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో కరోనా టెస్ట్ చేయించుకోగా, తాజాగా పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. దీంతో కేన్స్ టూర్ని క్యాన్సిల్ చేసుకుంటున్నట్టు ప్రకటించారు అక్షయ్. `కేన్స్ 2022లో ఇండియా పెవిలియన్లో మా సినిమా కోసం పునాదులు వేయాలని నిజంగా ఎదురుచూశాను. కానీ కోవిడ్ 19 సోకడం బాధగా ఉంది. దీంతో విశ్రాంతి తీసుకుంటాను. మీకు, మీ బృందానికి శుభాకాంక్షలు అనురాగ్ ఠాకూర్` అని ట్వీట్ చేశారు అక్షయ్.
అక్షయ్ కుమార్ ప్రస్తుతం `పృథ్వీరాజ్` చిత్రంలో నటించారు. పృథ్వీరాజ్ చౌహాన్ రాజు పాలన కాలంలోని కథాంశంతో హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందింది. చంద్రప్రకాష్ ద్వివేదీ దర్శకత్వం వహించారు. అక్షయ్తోపాటు సోనూసూద్, సంజయ్ దత్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా జూన్ 3న విడుదల కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలు పెంచారు అక్షయ్. వరుసగా ఆయన ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆయనకు కరోనా సోకడంతో కొన్ని రోజులు ప్రమోషన్కి బ్రేక్ పడనుంది.