ఫిలింఫేర్ అవార్డ్ వేడుక నేపథ్యంలో అనసూయ,అడివి శేష్ లకు అవమానం
- ఇటీవలే హైదరాబాద్ లో సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ 2017 వేడుక
- హైటెక్స్ లో జరిగిన అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ సెలెబ్స్
- అవార్డు వేడుకలో నామినేట్ అయినా.. అనసూయ, అడివి శేషుకు అందని అహ్వానం
అట్టహాసంగా నిర్వహిస్తున్నామంటూ ఫుల్ పబ్లిసిటీ ఇచ్చి మరీ నిర్వహించిన ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డుల వేడుక ఇటీవల గ్రాండ్ గానే జరిగింది. హైదరాబాద్ లో జరిగిన ఈ వేడుకలో తెలుగు సినిమాకు సంబంధించి ఉత్తమ నటుడిగా 'నాన్నకు ప్రేమతో' చిత్రానికి జూ.ఎన్టీఆర్ అవార్డు దక్కించుకోగా, హీరోయిన్ సమంత 'అ...ఆ' చిత్రానికి ఉత్తమ నటి అవార్డు దక్కించుకుంది.
ఇక ఈ అవార్డు వేడుక నిర్వాహకులు తమను తీవ్రంగా అవమానించారని అంటున్నారు నటుడు అడవిశేష్. 'క్షణం' సినిమాకుగాను తనతో పాటు యాంకర్,నటి అనసూయకు ఫిల్మ్ ఫేర్ నామినేషన్స్ దక్కాయని, అయినప్పటికీ తమకు కనీసం ఆహ్వానం కూడా పంపకుండా తీవ్రంగా అవమానించారని అడవి శేష్ ఆరోపించారు. ఫిల్మ్ ఫేర్ నిర్వాహకులు ఇలా ఎందుకు చేశారో తెలియదు కానీ... అవార్డ్స్ కార్యక్రమం ప్రారంభానికి గంట ముందు నాకు ఫోన్ చేసి క్షమాపణలు చెప్పారు అని అడిశేష్ తెలిపారు.
అయితే అనసూయకు కనీసం ఫోన్ కూడా చేయలేదట. అనసూయ కూడా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటోంది. టాలీవుడ్ లో ఏ అవార్డుల వేడుక జరిగినా తన అందంతో, యాటిట్యూడ్ తో సెంటరాఫ్ అట్రాక్షన్గా నిలిచే అనసూయ ఫిలింఫేర్ అవార్డుల వేడుకలో మాత్రం.. ఆహ్వానం అందక పోవటంతో వేడుకకు దూరంగా ఉంది.