ప్రియమణి పెళ్లి రిజిస్టర్ ఆఫీసులో...
- తెలుగులో గతంలో టాప్ రేసులో నిలిచిన హిరోయిన్ ప్రియమణి
- 2015లో ముస్తఫా రాజ్ తో ప్రియమణి నిశ్చితార్థం
- ఈ ఆగస్టు 23న రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోనున్న ప్రియమణి
డస్కీ బ్యూటీ ప్రియమణి త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతోంది. ముంబైకి చెందిన వ్యాపార వేత్త ముస్తఫా రాజ్తో 2015లోనే నిశితార్థం చేసుకున్న ప్రియమణి ఈ నెల్లోనే అతడిని వివాహం చేసుకోబోతోందట. ఇప్పటికే వివాహం కోసం ముస్తఫా, ప్రియమణి ఏడాదికి పైగా వెయిట్ చేశారు. నిశ్చితార్థం అనంతరమే పెళ్లి చేసుకోవాలనుకున్న ప్రియమణికి ఆమె జాతకం అడ్డు వచ్చిందట.
జ్యోతిష్యాన్ని బాగా నమ్మే ఇరు కుటుంబాలు ప్రియమణి జాతకం ప్రకారం ఒక ఏడాది పాటు పెళ్లిని వాయిదా వేశాయట. మూడేళ్ల ప్రేమాయణం అనంతరం ఇరు కుటంబాల అనుమతితో ఆగస్టు 23న పెళ్లి చేసుకోబోతున్నారట.
అంగ రంగ వైభవంగా ధూమ్ ధామ్ హడావుడి ఏం లేకుండా రిజిస్టర్ ఆఫీస్లో ఈ జంట పెళ్లి చేసుకోబోతోందట. పెళ్లి తర్వాత బెంగళూరులోని ఓ స్టార్ హోటల్లో రిసెప్షన్ ఏర్పాటు చేసి బంధుమిత్రులందరినీ ఆహ్వానిస్తారట. ప్రియమణి ప్రస్తుతం తెలుగులో ఒక బుల్లితెర డ్యాన్స్ షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.