ఐఆర్‌ఎస్‌ అధికారి సచిన్‌ సావంత్‌పై మనీలాండరింగ్‌ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) చార్జిషీట్‌ సమర్పించింది. అయితే ఈ కేసును విచారిస్తున్న అధికారులు.. సచిన్ సావంత్‌కు, మలయాళ సినీ నటి నవ్య నాయర్ మధ్య సంబంధాలను కూడా కనుగొన్నారు.

ఐఆర్‌ఎస్‌ అధికారి సచిన్‌ సావంత్‌పై మనీలాండరింగ్‌ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) చార్జిషీట్‌ సమర్పించింది. అక్రమ ఆస్తులు కూడబెట్టారని సచిన్ సావంత్‌పై ఆరోపణలు రావడంతో.. ఆయనను జూన్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును విచారిస్తున్న ఈడీ అధికారులు.. సచిన్ సావంత్‌కు, మలయాళ సినీ నటి నవ్య నాయర్ మధ్య సంబంధాలను కూడా కనుగొన్నారు. ఈ కేసులో ఆమె స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. ఈ కేసు ఆధారంగా రూపొందించిన ఎఫ్‌ఐఆర్‌లో సావంత్, అతని కుటుంబ సభ్యులు మొత్తం 2.46 కోట్ల ఆస్తులను కలిగి ఉన్నారని వెల్లడించింది. 2011లో సావంత్ కుటుంబం మొత్తం ఆస్తుల విలువ రూ.1.4 లక్షలు కాగా.. 2022 నాటికి అవి రూ.2.1 కోట్లకు పెరిగాయి. 

సీబీఐ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా సచిన్ సావంత్ మనీలాండరింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులు.. ఆయన నుంచి మొబైల్ డేటా, చాట్‌లు, స్టేట్‌మెంట్‌లను సేకరించారు. ఈ క్రమంలోనే ఈడీ అధికారులు ఈ కేసులో నవ్య నాయర్ ప్రమేయాన్ని కనుగొన్నారు. సచిన్‌ సావంత్‌, నవ్య నాయర్‌ చాలా సన్నిహితంగా మెలిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. నవ్యకు సచిన్ సావంత్ బంగారు ఆభరణాలతో పాటు కొన్ని ఖరీదైన బహుమతులు ఇచ్చినట్లు గుర్తించారు.

ఆ నగలు, బహుమతులు స్నేహంతోనే ఇచ్చారని.. సచిన్ సావంత్‌తో తనకు వేరే సంబంధం లేదని నవ్య తన స్టేట్‌మెంట్‌లో వెల్లడించింది. ముంబైలో తాము పొరుగువారిగా ఉన్న సమయంలో సావంత్‌తో స్నేహం ఏర్పడిందని ఆమె పేర్కొంది. తన కొడుకు పుట్టినరోజు సందర్భంగా అతడికి సచిన్ సావంత్ కొన్ని బహుమతులు ఇచ్చినట్టుగా నవ్య నాయర్ తెలిపింది. 

అయితే ఈడీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నవ్య నాయర్, సావంత్‌లు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నవ్యను కలవడానికి సచిన్ సావంత్ 8 నుంచి పది సార్లు కొచ్చికి వెళ్లాడు. అయితే దీనిపై నవ్యను ఈడీ ప్రశ్నించినప్పుడు.. ఎలాంటి సంబంధం లేదని తిరస్కరించింది. తాము కేవలం స్నేహితులమని చెప్పింది. ఇక, నవ్య నాయర్‌తో పాటు సచిన్ సావంత్ మరో మహిళా స్నేహితురాలి వాంగ్మూలాన్ని కూడా ఈడీ నమోదు చేసింది. 

ఇక, నవ్య నాయర్ విషయానికి వస్తే.. ఆమె ప్రధానంగా మలయాళ సినిమాల్లో నటించింది. అలాగే కన్నడ, తమిళ భాషా చిత్రాలలో కనిపించింది. ఆమె ఉత్తమ నటిగా రెండు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు, ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు(మలయాళం), తమిళ సినిమాకు ఆమె చేసిన కృషికి కలైమామణి అవార్డులను అందుకుంది.