ఆదాయపు పన్ను కేసులో నటి గౌతమికి మద్రాసు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. నాలుగు వారాల తర్వాత ఈ కేసు మరోసారి విచారణకు రానుంది.
ప్రముఖ సినీ నటి గౌతమికి మద్రాసు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. కొంతకాలంగా ఆమెపై ఆదాయపు పన్ను కేసు కొనసాగుతోంది. ఐటీ శాఖ తనపై పెట్టిన కేసుకి కౌంటర్ గా గౌతమి హై కోర్టుని ఆశ్రయించారు. గతంలో గౌతమి శ్రీపేరంబదూరు సమీపంలో వ్యవసాయ భూమిని విక్రయించారు.
ఈ విక్రయానికి సంబంధించి ఆమె ఆదాయపు పన్ను సరిగా చెల్లించలేదని ఐటి శాఖ ఆమె బ్యాంక్ ఖాతాలని సీజ్ చేసింది. గౌతమికి చెందిన దాదాపు 6 బ్యాంక్ ఖాతాలని ఐటి శాఖ సీజ్ చేసింది. దీనితో గౌతమి హై కోర్టుని ఆశ్రయించారు. తాజాగా ఈ కేసు హై కోర్టులో విచారణకు వచ్చింది.
తాను ఆ వ్యవసాయ భూమిని దాదాపు రూ 4 కోట్లకు విక్రయించానని పేర్కొన్నారు. ఐటి శాఖ చెబుతున్నట్లుగా తాను రూ 11 కోట్లకు విక్రయించింది వాస్తవం కాదని పేర్కొన్నారు. అలాగే ఆ మొత్తం క్యాపిటల్ గైన్ కేటగిరి కిందకు రాదని కూడా గౌతమి పేర్కొన్నారు. వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి గౌతమికి స్వల్ప ఊరట కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
మూలధనంలో 25 శాతం చెల్లిస్తే సీజ్ చేసిన బ్యాంక్ ఖాతాలని ఉపయోగించుకునే వీలు కల్పించాలని ఐటీ శాఖని న్యాయమూర్తి ఆదేశించారు. అనంతరం ఈ కేసు విచారణని జడ్జి నాలుగు వారాల పాటు వాయిదా వేశారు.
ఇక సినిమాల విషయానికి వస్తే గౌతమి ప్రస్తుతం సమంత శాకుంతలం చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. 90వ దశకంలో గౌతమి తెలుగు తమిళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.
