బాలీవుడ్ నటి జియా ఖాన్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు పదేళ్ల తర్వాత ఈ కేసులో సినీ నటుడు సూరజ్ పంచోలిని ముంబైలోని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.
బాలీవుడ్ నటి జియా ఖాన్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు పదేళ్ల తర్వాత ఈ కేసులో సినీ నటుడు సూరజ్ పంచోలిని ముంబైలోని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. సాక్ష్యాధారాల సరిగా లేనందున సూరజ్ పంచోలిని దోషిగా నిర్ధారించలేమని సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఏఎస్ సయ్యద్ అన్నారు. అందుకే నిర్దోషిగా ప్రకటిస్తున్నట్టుగా చెప్పారు. అయితే ఈ తీర్పు జియా తల్లి రబియా ఖాన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కేసుకు సంబంధించి గత పదేళ్లుగా పోరాడుతున్న రబియా ఖాన్.. తన కూతురుది హత్యేనని పునరుద్ఘాటించారు.
ఆత్మహత్యకు ప్రేరేపించారనే అభియోగం పోయిందని.. అయితే తన బిడ్డ ఎలా చనిపోయిందని రబియా ఖాన్ ప్రశ్నించారు. ఇది హత్య కేసు అని.. హైకోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు. జియా మరణానికి కారణం ఇంకా కనుగొనబడలేదని తెలిపారు. ఈ కేసులో దోషిగా తేలి ఉంటే.. సూరజ్ పంచోలి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉండేది. ఇక, సూరజ్ పంచోలి.. యాక్టర్ కపుల్ ఆదిత్య పంచోలి, జరీనా వహాబ్ల కుమారుడు.
ఇక, న్యూయార్క్లో జన్మించిన జియా ఖాన్.. సినిమాల్లో నటించాలనే ఆసక్తితో భారత్కు వచ్చింది. బాలీవుడ్ చిత్రాలు నిశ్శబ్ద్, గజినీ చిత్రాలలో తన పాత్రలకు జియా ఖాన్ మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే జియాఖాన్ 2013 జూన్ 3వ తేదీన ముంబైలోని తన జుహూ ఇంట్లో ఉరి వేసుకుని కనిపించారు. మరణానికి ముందు జియా రాసిన ఆరు పేజీల లేఖ ఆధారంగా సూరజ్ పంచోలీని పోలీసులు అరెస్టు చేసి, ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు అతనిపై కేసు నమోదు చేశారు. జియా హత్యకు గురైందని ఆమె తల్లి రబియా ఖాన్ ఆరోపించారు. ఇక, 2013 జూలైలో బాంబే హైకోర్టు సూరజ్ పంచోలికి బెయిల్ మంజూరు చేసింది.
అయితే 2014లో తన కూతురు ఆత్మహత్యతో చనిపోలేదని, హత్య వల్లే చనిపోయిందని రబియా విజ్ఞప్తి చేయడంతో ఈ కేసు సీబీఐకి బదిలీ చేయబడింది. 2015లో భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 306 ప్రకారం సూరజ్పై ఆత్మహత్యకు ప్రేరేపించినట్లుగా దర్యాప్తు సంస్థ అభియోగాలు మోపింది. సూరజ్తో జియా గందరగోళ సంబంధాన్ని వివరించిన ఆమె లేఖను జత చేసింది. ఆ తర్వాత 2021లో కేసును ప్రత్యేక సీబీఐ కోర్టుకు అప్పగించారు. ఇరుపక్షాల తుది వాదనలు విన్న తర్వాత కోర్టు నేడు తీర్పు వెలువరించింది.