మనోజ్ బాజ్పాయ్ ఇంట విషాదం.. ఢిల్లీ హాస్పిటల్లో తండ్రి కన్నుమూత
ప్రముఖ నటుడు మనోజ్ బాజ్పాయ్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి ఆర్కే బాజ్పాయ్ వయసు సంబంధ సమస్యలతో ఈ రోజు ఢిల్లీలోని ఓ హాస్పిటల్లో మరణించారు. కేరళలో షూటింగ్లో ఉన్న మనోజ్ బాజ్పాయ్ విషయం తెలుసుకుని వెంటనే ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు.
న్యూఢిల్లీ: ప్రముఖ నటుడు మనోజ్ బాజ్పాయ్ ఇంట విషాదం నెలకొంది. మనోజ్ బాజ్పాయ్ తండ్రి ఆర్కే బాజ్పాయ్(83) హాస్పిటల్లో మరణించారు. ఆర్కే బాజ్పాయ్ వయసు సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. అందుకే సెప్టెంబర్లోనే చికిత్స తీసుకోవడానికి హాస్పిటల్లో చేరారు. కానీ, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి ఆదివారం కన్నుమూశారు. కాగా, మనోజ్ బాజ్పాయ్ ఓ ప్రాజెక్టులో భాగంగా కేరళలో షూటింగ్లో ఉన్నారు. తండ్రి మరణ వార్త వినగానే వెంటనే ఢిల్లీకి ప్రయాణమయ్యారు. అంతిమ క్రియలు నిర్వహించడానికి షూటింగ్ మధ్యలోనే మనోజ్ బాజ్పాయ్ ఇంటికి చేరారు. ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీలోని నిగమ్ బోధ్లో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.
మనోజ్ బాజ్పాయ్ మరణంపై చిత్రపరిశ్రమలోని ప్రముఖులు సంతాపం ప్రకటించారు. మనోజ్ బాజ్పాయ్కు సానుభూతి తెలిపారు. డైరెక్టర్, లిరిసిస్ట్ అవినాశ్ దాస్ మనోజ్ బాజ్పాయ్ తండ్రిని తలుచుకుంటూ ట్విట్టర్లో పోస్టు పెట్టారు. బీతి హర్వా ఆశ్రమానికి వెళ్లినప్పుడు తాను ఆర్కే బాజ్పాయ్ ఫొటో తీశారని గుర్తుచేసుకుంటూ దాన్ని ట్వీట్ చేశారు. సాధారణ జీవితాన్ని గడపడంలో ఆయన ఉన్నతుడని, ఔదార్యమున్నవారని పేర్కొంటూ శ్రద్ధాంజలి ఘటించారు.
మనోజ్ బాజ్పాయ్ నటించిన ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ విశేష ప్రేక్షకాదరణ పొందిన సంగతి తెలిసిందే. ది ఫ్యామిటీ మ్యాన్ 2, రే, డయల్ 100 వంటి ఆయన నటించిన చిత్రాలు ఇటీవలే విడుదలయ్యాయి. మనోజ్ బాజ్పాయ్ రెండు సార్లు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు గెలుచుకున్నారు. విమర్శకుల నుంచి ప్రశంసలందుకున్న సత్య, శూల్, పింజార్, గ్యాంగ్స్ ఆఫ్ వాసీపూర్, అలీగఢ్ వంటి చిత్రాల్లో నటించి పేరు సంపాదించారు.