ఆట డ్యాన్స్ షో ఫేమ్ టీనా కన్నుమూత: సందీప్ ఎమోషనల్ పోస్ట్
ఓంకార్ యాంకర్గా వ్యవహరించిన ఆట డ్యాన్స్ రియాలిటీ షోతో మంచి ఫేమ్ సంపాదించుకున్నారు టీనా. ఫస్ట్ సీజన్లో డ్యాన్సర్గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆమె.. ఆ షో నాలుగో సీజన్కు జడ్జ్గా కూడా వ్యవహరించారు.
ఓంకార్ యాంకర్గా వ్యవహరించిన ఆట డ్యాన్స్ రియాలిటీ షో చాలా పాపులరైన సంగతి తెలిసిందే. ఆ షో ద్వారా పలువురు కొత్త డ్యాన్సర్లకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఆట డ్యాన్స్ షో ఫస్ట్ సీజన్ విన్నర్గా నిలిచిన టీనా మృతిచెందారు. కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న టీనా.. ఇటీవల మరణించారు. ఈ విషయాన్ని ఆట సందీప్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. టీనా మరణవార్తను దిగ్భ్రాంతి చెందినట్టుగా చెప్పారు. ఆమెతో తనకున్న పరిచయాన్ని గుర్తుచేసుకున్నాడు.
‘‘ఆట ఫస్ట్ సీజన్ విన్నర్ టీనా సాధు మరణించిందనే విషాద వార్తతో దిగ్భ్రాంతికి గురయ్యాను. చాలా బాధపడ్డాను. ఆమె చాలా వినయపూర్వకమైన వ్యక్తి.. జీ తెలుగు ఆట-1 డాన్స్ రియాలిటీ షోలో నా కో పార్ట్నర్. ఆమె కుటుంబానికి, ఆమెను ప్రేమించేవారికి నా ప్రగాఢ సానుభూతి’’అని ఆట సందీప్ పేర్కొన్నాడు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఇక, టీనా మృతిపై పలువురు నెటిజన్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఆట సీజన్ వన్ విన్నర్గా నిలిచిన టీనా.. ఆ తర్వాత సీజన్ 4లో జడ్జ్గా వ్యవహరించారు. ఆ తర్వాత నుంచి ఆమె ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. అయితే టీనా మృతికి కారణాలు మాత్రం తెలియరాలేదు. అయితే మృతికి గల కారణాలపై ఎలాంటి అధికారిక సమాచారం మాత్రం అందుబాటులో లేదు.
మరోవైపు టీనా మృతిపై ప్రముఖ యాంకర్ శిల్పా చక్రవర్తి కూడా దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అసలేం జరిగిందో తెలియదన్న శిల్ప.. టీనా మరణవార్త విని చాలా బాధపడినట్టుగా పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశారు. ఆమె చాలా కూల్గా ఉండే వ్యక్తి అని చెప్పారు. ఒక దశాబ్దం తర్వాత తాను టీనాను కలిశానని.. ఇద్దరి మంచి సంభాషణ జరిగిందని గుర్తుచేసుకున్నారు. ఈ పోస్టు టైప్ చేస్తున్నప్పుడు తన కళ్లలో నీళ్లు తిరిగాయని చెప్పారు. టీనాతో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేశారు.