‘కాంతార’ప్రీక్వెల్..జరిగే కాలం పై షాకింగ్ అప్డేట్
తాజాగా కాంతార ప్రీక్వెల్ సినిమా గురించి ఆసక్తికర అప్డేట్ బయిటకు వచ్చింది. ఈ కథ ఏ కాలంలో జరుగుతుంది అంటూ సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు.

‘కాంతార’ సినిమా మొదట కన్నడలో విడుదలై సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళం, హిందీలోకి మేకర్స్ డబ్ చేసి విడుదల చేస్తే అక్కడా అంతకు మించి అన్నట్లు ఆడింది. ఈ మూవీ రిలీజ్ మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ రికార్డులు దద్దరిల్లాయి. ఐఎమ్డీబీలో అత్యధిక రేటింగ్ను సాధించిన సినిమాగా ‘కాంతార’ నిలిచింది. ఈ నేపధ్యంలో ‘కాంతారా’ ప్రీక్వెల్ ప్రకటించారు. దాంతో ఈ చిత్ర అభిమానులంతా ప్రీక్వెల్ లో ఏమి చూడబోతున్నారు. ఈ కథ ఏ కాలంలో జరుగుతుంది అంటూ సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ప్రీక్వెల్ సినిమా గురించి కొన్ని విషయాలు బయిటకు వచ్చాయి.
కన్నడ మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ..కాంతారా ప్రీక్వెల్ చిత్రం 400 AD లో జరుగుతుంది. ఇదొక రియలిస్టిక్ రూరల్ థ్రిల్లర్ గా రూపొందనుంది. ఆ కాలం నాటి మనుష్యులు అప్పటి కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారని వినికిడి. అలాగే ఈ చిత్రంపై 150 కోట్ల దాకా బడ్జెట్ పెడుతున్నారని చెప్తున్నారు. వాస్తవానికి కాంతారా చిత్రం 14 కోట్లతో నిర్మితమై సెన్సేషన్ క్రియేట్ చేసింది. దాదాపు 320 కోట్లు దాకా తెచ్చిపెట్టింది. ఇప్పుడు 150 కోట్లు పెడుతున్నారంటే ఎంత నమ్మకం ఉంటే ఆ స్దాయి బడ్జెట్ పెడతారు. అలాగే 14 కోట్లకే ఆ స్దాయి క్వాలిటీ ఇస్తే ఇంక Rs 150 కోట్లకు అయితే మామూలుగా ఉండదని ఫ్యాన్స్ అంటున్నారు.
మొదటి పార్ట్ షూటింగ్ను ఎక్కువ శాతం ఆయన సొంత ఊరు కుందాపురలో చేయగా.. ఇప్పుడు రెండో భాగాన్ని బెంగుళూర్లోని పలు ప్రాంతాల్లో చిత్రీకరించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ సారి సినిమాలో నటించే స్టార్స్ ఎంపికలో కూడా మార్పులు చేయనున్నారని టాక్. అంతే కాకుండా మొత్తం షూటింగ్ను నాలుగు షెడ్యూళ్లలో పూర్తి చేయాలని మూవీ టీమ్ ప్లాన్ చేస్తోందట. ఈ క్రమంలో సినిమా షూటింగ్ను వచ్చే ఏడాది ప్రారంభంలో ముగించి.. చివర్లో థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేయనున్నారట.
అలాగే 'కాంతార' ఫస్ట్ పార్ట్ ఎక్కడైతే ప్రారంభమైందో.. దానికి ముందు జరిగిన సంఘటనలను ఈ ప్రీక్వెల్లో మేకర్స్ చూపనున్నారు. ఇందులో పంజుర్లి దేవతకు సంబంధించిన సన్నివేశాలు ఎక్కువగా ఉండనున్నాయని సమాచారం. అంతే కాకుండా భూతకోల నేపథ్యాన్ని ఈ ప్రీక్వెల్లో మరింత చూపనున్నారట. ఇక దర్శకుడు రిషబ్ శెట్టి ఈ సినిమా కోసం గుర్రపు స్వారీలో ప్రత్యేక శిక్షణ సైతం తీసుకున్నారని సమాచారం.ఈ మేరకు రిషబ్ శెట్టి(Rishab Shetty) 11 కేజీల దాకా బరువు తగ్గారని తెలుస్తోంది.
‘కాంతార’ ప్రీక్వెల్లో గ్రామస్తుల మధ్య అనుబంధాలు, గుళిగ దైవం, రాజు గురించి చూపిస్తామని నిర్మాత విజయ్ కిరంగదూర్ అన్నారు. గ్రామస్తులతో పాటు భూమిని రక్షించడానికి రాజు ఏం చేశాడనేది తెర మీద చూపించనున్నట్లు చెప్పారు. సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాల కోసం వర్షాధారిత వాతావరణం అవసరమన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.