తన భర్తకు గుండెకు సంబంధించిన సమస్య లేదని తెలుగు సీనియర్ నటుడు జయప్రకాశ్ రెడ్డి భార్య రాజ్యలక్ష్మి చెప్పారు. తమ కుటుంబ సభ్యులకు పాజిటివ్ రావడంతో తామిద్దరం పెంట్ హౌస్ లో ఉంటున్నట్లు తెలిపారు.

గుంటూరు: తన భర్తకు గుండెకు సంబంధించిన ఏ విధమైన సమస్య కూడా లేదని సీనియర్ నటుడు జయప్రకాశ్ రెడ్డి సతీమణి రాజ్యలక్ష్మి చెప్పారు. భర్త మరణంతో ఆమె కన్నీరుమున్నీరయ్యారు. తమ కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ రావడంతో తామిద్దరు పెంట్ హౌస్ లోనే ఉంటున్నామని ఆమె చెప్పారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

షుగర్ లెవెల్స్ పడిపోవడంతో వారం రోజులుగా జయప్రకాశ్ రెడ్డి అనారోగ్యంతో ఉన్నారని ఆమె చెప్పారు. మూడేళ్లుగా గుంటూరులోనే తాము నివాసం ఉంటున్నట్లు తెలిపారు. షూటింగ్ ఉన్నప్పుడు హైదరాబాదు వెళ్లి వచ్చేవారని చెప్పారు కొత్తతరం నటులను ప్రోత్సహించేవారని ఆమె అన్నారు.

Also Read: జయప్రకాష్‌ రెడ్డి జీవితంలో ఆసక్తికర విశేషాలు..

తెలుగు సీనియర్ నటుడు జయప్రకాశ్ రెడ్డి కన్నుమూసిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఆయన గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఉదయం బాత్రూంలో కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించేలోగానే ఆయన మరణించారు.

తెలుగు సినిమాల్లో రాయలసీమ మాండలికంలో ఆయన విలనిజాన్ని పండించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ విధించినప్పటి నుంచి గుంటూరులోని స్వగృహంలోనే ఉంటున్నారు. తెలుగు సినిమాల్లో ఆయన విలక్షణమైన పాత్రలను పోషించారు.

Also Read: జయప్రకాశ్ రెడ్డి మరణం: ఆయన తీరని కోరిక తెలుసా..

తూర్పు జయప్రకాశ్ రెడ్డి 1946 అక్టోబర్ 10వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా సిర్వేల్ లో జన్మించారు. బాలకృష్ణ హీరోగా నటించిన సమరసింహా రెడ్డి సినిమాలో పోషించిన వీరరాఘవరెడ్డి పాత్ర అతనికి ఎనలేని పేరు తెచ్చిపెట్టింది. విలన్ పాత్రను పండించిన తీరు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. 

జయం మనదేరా, చెన్నకేశవ రెడ్డి సినిమాల్లో విలన్ పాత్రలు పోషించారు. హాస్య పాత్రలను కూడా పోషించారు. 1988లో బ్రహ్మపుత్రుడు సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. ఆయన ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో చదువుకున్నారు. ఆయనను నంది అవార్డు కూడా వరించింది.