టిడిపి నుండి ఇటీవల సస్పెండ్ అయన వల్లభనేని వంశీ విషయంలో స్సీకర్ ప్రత్యేక శ్రద్ద చూపించారని... తనకు ప్రత్యేక స్థానం కేటాయించాలన్న అతడి విన్నపంపై వెంటనే స్పందించడంపై ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. 

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ చరిత్రలో ఈరోజుని ఒక దుర్దినంగా భావిస్తున్నామని టీడీపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని ప్రధాన సమస్యలు పరిష్కారమయ్యేందుకు ఉపయోగపడే ప్రశ్నోత్తరాల సమయాన్ని అధికారపార్టీ దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. ముఖ్యంగా మొదటి గంటలో సభ్యులు అడిగే ప్రశ్నలకు గండికొడుతూ వైసీపీ ప్రభుత్వం కొత్త సంప్రదాయాన్ని సృష్టించిందని ఆయన మండిపడ్డారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడికి మైక్‌ ఇవ్వకుండా అవమానించారంటూ మంగళవారం టీడీపీ సభ్యులందరూ సభ నుండి వాకౌట్‌ చేశారు. ఈ క్రమంలో బుచ్చయ్యచౌదరి విలేకరులతో మాట్లాడుతూ... ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడటానికి అవకాశమిచ్చి, ప్రశ్నోత్తరాల సమయం జరగకుండా చేయడం బాధాకరమన్నారు. 

పార్టీ మారాలని నిర్ణయించుకున్న వ్యక్తి ఆ పార్టీకి రాజీనామా చేయకుండా అసెంబ్లీకి వచ్చాడంటూ వల్లభనేని వంశీని ఉద్దేశిస్తూ మాట్లాడారు. అలాంటి వ్యక్తికి ప్రత్యేకస్థానం ఇవ్వాలని స్పీకర్‌లాంటి వ్యక్తే చెప్పడం సిగ్గుచేటన్నారు. పార్టీ మారితేనే తమ పార్టీలో చేర్చుకుంటామని చెప్పిన జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడు టీడీపీ నుంచి వెలివేయబడ్డ వ్యక్తికి ప్రత్యేకస్థానం ఎలా ఇప్పిస్తారని బుచ్చయ్యచౌదరి ప్రశ్నించారు. 

read more వంశీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడో...ఇక అంతే: చినరాజప్ప

గతంలో తాను కూర్చునే స్థానం మార్చాలని అనేకసార్లు కోరినా స్పందించని స్పీకర్‌ నేడు ఉన్నపళంగా ప్రతిపక్షపార్టీ సస్పెండ్‌ చేసిన వ్యక్తికి అసెంబ్లీలో స్థానం కల్పించడం దారుణం కాదా అని ప్రశ్నించారు. గౌరవంగా వ్యవహరించాల్సిన స్పీకర్‌ ద్వందప్రమాణాలు పాటిస్తున్నాడని, అత్యున్నత స్థానంలో ఉన్నవారు పచ్చిబూతులు తిడుతున్నా స్పందించకపోవడం విచారకరమన్నారు. 

సన్నబియ్యానికి, నాణ్యమైన బియ్యానికి తేడా చెప్పమని సంబంధిత మంత్రిని తాము కోరామని... కానీ మంత్రి సమాధానం చెప్పడం వదిలేసి ముఖ్యమంత్రి మాటతప్పరు.. మడమతిప్పరని డబ్బాలు కొట్టుకుంటున్నారన్నారు. గతంలో సీఎం చేసిన వాగ్ధానాలు, చెప్పిన మాటలు చూపించకుండా వారికి అవసరమైన వాటినే అసెంబ్లీలో ప్రదర్శించారని బుచ్చయ్య పేర్కొన్నారు. 

ప్రతిపక్షానికి అవకాశమివ్వకుండా మంత్రులతో తిట్టిస్తూ సభను దారి తప్పిస్తున్నారన్నారు. ప్రజలిచ్చిన మెజారిటీని అపహస్యం చేస్తూ ప్రతిపక్షాన్ని చీల్చేలా రాజకీయాలు చేయడం అధికార పార్టీ మానుకోవాలన్నారు.

read more ఉల్లి కొరతను ముందే జగన్ పసిగట్టారు... అందువల్లే ఈ పరిస్థితి: మోపిదేవి

స్పీకర్‌ వ్యవహారశైలి ఎలా ఉండాలో ఆయనకే తెలియడం లేదన్నారు. పార్టీ విధానాలకు అనుగుణంగా సభను నడిపితే రాష్ట్రం ఎటుపోతుందో చెప్పాల్సిన పనిలేదన్నారు.తనను గెలిపించిన పార్టీకి రాజీనామా చేయకుండా రెబల్‌గా ఉండే వ్యక్తికి ప్రత్యేకస్థానం ఇవ్వడం అసెంబ్లీ నియమావళికి విరుద్ధమన్నారు.