Asianet News TeluguAsianet News Telugu

అందుకోసం ఆర్డినెన్స్... తిరస్కరించాలని గవర్నర్‌ను కోరాం: అచ్చెన్నాయుడు

ఏపిలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు అన్యాయం జరిగేలా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మాజీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఈ విషయంపైనే ఇతర నాయకులతో  కలిసి రాష్ట్ర గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. 

TDP Leaders Meet AP Governer Over BC Reservations
Author
Amaravathi, First Published Mar 4, 2020, 5:50 PM IST

రాష్ట్రంలో 50శాతం పైబడి ఉన్న బడుగు, బలహీనవర్గాలకు జగన్ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని, రిజర్వేషన్ల తగ్గింపుద్వారా ఆయా వర్గాలకు జగన్ చేసిన తీరని మోసాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తెలిపారు. బుధవారం టీడీపీకిచెందిన బీసీనేతల బృందం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ని, విజయవాడలోని ఆయన నివాసంలో కలిశారు. 

అనంతరం మాజీ మంత్రి అచ్చెన్నాయుడు విలేకరులతో మాట్లాడుతూ... బడుగు, బలహీనవర్గాలు  సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అత్యున్నతస్థానాలకు ఎదిగారంటే అందుకు కారణం  టీడీపీ వ్యవస్థాపకులు, స్వర్గీయ నందమూరి తారక రామారావేనని అన్నారు. తెలుగుదేశం ఆవిర్భావిని ముందు ఆనాడున్న ప్రభుత్వాలన్నీ బీసీలను ఓటుబ్యాంకుగానే చూశారన్నారు. 

ఇన్నేళ్ల రాష్ట్రచరిత్రలో ఎన్నడూ, ఎవరూ చేయని విధంగా రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డే బీసీలను అణచివేసే కార్యక్రమాలను కొనసాగించారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీకి బీసీలు అన్నివేళలా అండగా ఉంటున్నారన్న అక్కసుతోనే జగన్ వారిపై కక్షసాధింపులను కొనసాగిస్తున్నాడన్నారు. స్థానికసంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని తామంతా గవర్నర్ ను కోరడం జరిగిందని తెలిపారు.

వైసీపీకి చెందిన బీసీనేతలెవరూ రిజర్వేషన్లు తగ్గినా నోరెత్తడంలేదని మండిపడ్డారు. ఎన్టీఆర్ దయవల్ల అనేకమంది బీసీలు స్థానికసంస్థల ఎన్నికల్లో నిలిచి ప్రజలమద్ధతుతో గెలిచి పదవులు పొందితే, నేరు వారికి ఆ అవకాశం దక్కకుండా చేయడం కోసం జగన్ కంకణం కట్టుకున్నాడని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి చర్యలవల్ల స్థానికసంస్థల్లో 16వేల పదవులు బీసీలకు దక్కకుండా పోతున్నాయని మాజీమంత్రి ఆవేదన వ్యక్తంచేశారు. 

read more  జగన్ ప్రభుత్వ శాడిజం... చీప్ లిక్కర్ కోసం ప్రపంచ బ్యాంకుకా...?: అనిత ఫైర్

అధికారంలోకి రాకముందు బీసీలను ఆదుకుంటానని, వారికి రిజర్వేషన్లు తగ్గకుండా చూస్తానని చెప్పిన జగన్ నేడు వారి అధికారాలను కత్తిరించడానికి సిద్ధపడటం సిగ్గుచేటన్నారు. 1994లో నాటి టీడీపీ ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చి బీసీలకు 34శాతం రిజర్వేషన్లు దక్కేలా శాసనసభలో ఆమోదం చేయడం జరిగిందన్నారు. తరువాత జరిగిన 4 పర్యాయాల ఎన్నికల్లో కూడా రిజర్వేషన్లకు కోత పడలేదన్నారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడుకూడా 34శాతం రిజర్వేషన్లే అమలయ్యాయని... 2013లో కూడా అదే దామాషాప్రకారం బీసీలు స్థానికసంస్థల్లో పోటీచేయడం జరిగిందన్నారు. 

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాకే బీసీల రిజర్వేషన్లకు కోతపడిందన్నారు. బీసీలకు రిజర్వేషన్లు ఎందుకు తగ్గాయంటే.. అందుకు సుప్రీంకోర్టు తీర్పుని జగన్ ప్రభుత్వం సాకుగా చూపుతోందని, 2010లో సుప్రీం తీర్పుచెప్పినా 2013లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం 60.55 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించారన్నారు. ఆనాడు కిరణ్ ప్రభుత్వంపై కూడా సుప్రీంకోర్టులో కేసులు వేశారని, కానీ సుప్రీంకోర్టు సింగిల్ బెంచ్ బీసీవర్గాలకు అనుకూలంగా తీర్పునివ్వడం జరిగిందని అచ్చెన్నాయుడు గుర్తుచేశారు. 

బీసీలకు అన్యాయం జరగకుండా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తే అత్యున్నత న్యాయస్థానం 60.55 శాతంతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకోవచ్చని సూచించడం జరిగిందన్నారు. నేడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం హైకోర్టు తీర్పునే అమలుచేయడానికి ముందుకెళుతోందని, బీసీలకు అన్యాయం చేయడానికే సిద్ధపడుతోందన్నారు. వైసీపీకి చెందిన వారే సుప్రీంకోర్టులో కేసులువేసి బీసీలకు అన్యాయం జరగడానికి కారణమైనప్పటికీ జగన్ ఎందుకు స్పందించడంలేదన్నారు. 

read more  ముగిసిన క్యాబినెట్ భేటీ : స్థానిక ఎన్నికల్లో తేడా వస్తే ఇక అంతే...

1987 నుంచి 2020 వరకు ఎన్నిపార్టీలు, ఎందరు ముఖ్యమంత్రులు మారినా బీసీలకు రిజర్వేషన్లలో జరగని అన్యాయం ఒక్క జగన్ ప్రభుత్వంలోనే జరగడం బాధాకరమన్నారు. 34శాతం రిజర్వేషన్లలో 10శాతం కోతపడినా హైకోర్టులో రిజర్వేషన్లపై వాదనలు జరిగేటప్పుడు అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం తరుపున వాదనలు వినిపిస్తూ ‘’మీరు ఎంతశాతం రిజర్వేషన్లు ఇచ్చినా ప్రభుత్వానికి అభ్యంతరం లేదు.. మాకు ఎన్నికలు జరగడమే ముఖ్యమని’’ చెప్పబట్టే కోర్టు రిజర్వేషన్లలో కోతపెట్టి 50శాతానికి పరిమితం చేసిందన్నారు. 

హైకోర్టులో వాదనలు జరుగుతుండగానే వైసీపీకి చెందిన రాఫ్తాడుమండల కన్వీనర్, రెడ్ల సంఘం ప్రధాన కార్యదర్శి అయిన ప్రతాపరెడ్డి లతో సుప్రీంకోర్టులో జగన్ ప్రభుత్వం కేసులు వేయించిందన్నారు. అమరావతి రైతులకు వ్యతిరేకంగా వాదనలు వినిపించడానికి ఢిల్లీ నుంచి లాయర్లను పిలిపించిన జగన్ ప్రభుత్వం, బీసీల తరుపున వాదనలు వినిపించడానికి మాత్రం రాష్ట్ర అడ్వకేట్ జనరల్ తో సరిపెట్టిందన్నారు. హైకోర్టు నుంచి తీర్పు రాగానే మంత్రి బొత్స, ఇతరమంత్రులు ఆనందపడిపోయారని, బీసీలకు అన్యాయం జరిగిందని సంబరపడ్డారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. 

140 బీసీ కులాలకు అన్యాయం జరుగుతున్నా జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవడంలేదని, ఆయన వైఖరి ఏమాత్రం సరిగా లేనందునే తాము గవర్నర్ ని కలవడం జరిగిందన్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం ప్రభుత్వం 24 శాతం రిజర్వేషన్లకే పరిమితమై తదనుగుణంగా చట్టంచేయాలని చూస్తోందన్నారు. ప్రభుత్వం పంపే ఆర్డినెన్స్ గవర్నర్ ముందుకే వస్తుంది కాబట్టి దాన్ని తిరస్కరించాలని ఆయన్ని కోరడం జరిగిందన్నారు. 

ప్రభుత్వం బీసీలకు న్యాయం చేసేలా ఇప్పటికైనా సుప్రీంకోర్టుకి వెళ్లకపోతే బీసీసంఘాలతో కలిసి టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తుందని మాజీ మంత్రి తేల్చిచెప్పారు. రాష్ట్రంలోని బీసీసంఘాలతో కలిసి సుప్రీంకోర్టులో కూడా టీడీపీ పోరాడుతుందన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బీసీలకు రిజర్వేషన్లు ఎందుకు తగ్గాయో, ప్రభుత్వంలోని బీసీ మంత్రులు, వైసీపీలోని బీసీనేతలు ఆలోచించాలని అచ్చెన్నాయుడు సూచించారు. 

గవర్నర్ ని కలిసినవారిలో వర్ల రామయ్య (పొలిట్ బ్యూరోసభ్యులు), బచ్చుల అర్జునుడు, బుద్ధావెంకన్న (ఎమ్మెల్సీలు), ముద్దరబోయిన వెంకటేశ్వరరావు (మాజీ ఎమ్మెల్యే),  శ్రీమతి పంచుమర్తి అనురాధ (పార్టీ అధికారప్రతినిధి), టీడీపీనేతలు, కార్పొరేషన్ మాజీఛైర్మన్లు బొడ్డు వేణుగోపాలరావు, జయప్రకాశ్ నారాయణ, కాగిత కృష్ణ ప్రసాద్, దారపనేని నరేంద్ర (పార్టీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్) ఉన్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios