Asianet News TeluguAsianet News Telugu

సొంత నియోజకవర్గానికి జగన్ క్రిస్మస్ కానుక

కడప జిల్లా పర్యటనలో భాగంగా సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించిన సీఎం జగన్ అక్కడి ప్రజలకు క్రిస్మస్ కానుక అందించారు. ఈ నియోజకవర్గంపై ఆయన వరాల జల్లు కురిపించారు.   

Pulivendula will be developed in all fronts: CM YS Jagan
Author
Pulivendula, First Published Dec 25, 2019, 9:13 PM IST

కడప జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ బుధవారం సొంత నియోజకర్గమైన  పులివెందులలో పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ అబివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. తన సొంత నియోజకవర్గమైన  పులివెందులను అన్ని రకాలుగా అభివృద్దిపర్చి రాష్ట్రానికి ఆదర్శంగా తయారు చేస్తానని ఈ సందర్భంగా జగన్ హామీ ఇచ్చారు.  

పులివెందుల జూనియర్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో జరిగిన బహిరంగ సభలో జగన్‌ ప్రసంగించారు. ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు అడుగులేస్తున్నామన్నారు.మొదటి విడతలో చేపట్టబోయే పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ వైద్యకళాశాల నిర్మాణానికి శంకుస్థాన చేశామని....దీనికోసం రూ.347 కోట్లు ఖర్చుచేస్తున్నట్లు వెల్లడించారు. 

గాలేరు నగరి సులజ స్రవంతి ప్రధాన కాల్వనుంచి వేముల, వేంపల్లి మండలాల్లోని 15వేల ఎకరాల ఆయకట్టుకు స్థిరీకరణకు గాను ఎత్తిపోతల పథకాన్ని నిర్మాణంచేయనున్నట్లు ప్రకటించారు. అలవలపాడు, పెండ్లూరు, నాగూరు గ్రామాలకు జీఎన్‌ఎస్‌ఎస్‌ నుంచి నీళ్లు అందిండచడమే కాకుండా పీబీసీ ఆయకట్టుకు చివర్లో ఉన్న వి.కొత్తపల్లి, గిడ్డంగివారిపల్లి, టి.వెలమారిపల్లి, ముచ్చుకోన చెరువుల ద్వారా నీళ్లు వెళ్లి పాపాగ్ని నదిలో కలుసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మధ్యలో నందిపల్లి, కుప్పాలపల్లి, ముసలిరెడ్డిపల్లి గ్రామాలకుకూడా దీనివల్ల ప్రయోజనం చేకూరుతుందని  తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.58 కోట్లను ఖర్చుచేస్తున్నామని... దీనికూడా శంకుస్థాపన చేశామని తెలిపారు.  

చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుండి ఎర్రపల్లె చెరువుకు నీటిని నింపడం, వేముల మండలంలోని యురేనియం కార్పొరేషన్‌ ఇండియా లిమిటెడ్‌ వల్ల ప్రభావితమయ్యే 7 గ్రామాలకు తాగునీటి సరఫరా నిమిత్తం ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తామన్నారు. కోమనూతల, ఎగుపల్లె, మురాలచింత, అంబకపల్లి, ఎర్రబల్లి చెరువుకు, మోట్లూతలపల్లి వంకకు, యూసీఐఎల్‌ ప్రభావిత గ్రామాలకు ప్రయోజనం చేకూరుతుందని వెల్లడించారు.

 గిడ్డంగిలవారిపల్లెలో 1.1 టీఎంసీ రిజర్వాయర్‌ కూడా నిర్మిస్తున్నామన్నారు. వీటివల్ల యూసీఐఎల్‌ పల్లెలకు నీరు పూర్తిగా అందుతుందన్నారు. అయితే ఈ రిజర్వాయర్ నిర్మాణానికి అక్షరాల రూ.350 కోట్లను ఖర్చుచేస్తున్నట్లు తెలిపారు.

read more  కుప్పం పోలీస్ స్టేషన్ లో చంద్రబాబుపై ఫిర్యాదు... నాయకులతో చంద్రబాబు భేటీ

''పులివెందుల మున్సిపాల్టీలో 57.36 కిలోమీటర్ల భూగర్భ డ్రైనేజీ కోసం అక్షరాల రూ.100 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాం. దీనికీ శంకుస్థాపన చేస్తున్నాం. పులివెందుల మున్సిపాల్టీలో 142.56 కిలోమీటర్ల మేర తాగునీటి సరఫరా కోసం పైపులైన్లు వేస్తున్నాం. రూ.65 కోట్లు ఖర్చు చేస్తున్నాం. దీనికీ ఇవాళ శంకుస్థాపన చేశాం'' అని సీఎం తెలిపారు.

 ''వేంపల్లి గ్రామ పంచాయతీలో 82.50 కిలోమీటర్ల మేరకు భూగర్భ డ్రైనేజీ ఏర్పాటు కోసం రూ.63 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాం. పాడా నిధులతో వివిధ అభివృద్ధి పనులు అంటే సీసీరోడ్లు, పట్టణ సుందరీకరణ, అంగన్‌వాడీ భవనాలు, పీబీసీ, సీబీఆర్‌ల కింద వివిధ చెరువులకు నీటి సరఫరా, జూనియర్‌ కాలేజీలో మౌలిక సదుపాయాల కల్పన, పీబీసీ నుంచి డొల్లవాగు చెరువుకు ఎత్తిపోతల పథకం, లింగాల చెరువునుంచి వనంబావి చెరువుకు ఎత్తిపోతల పథకం, నాయిని చెరువునుంచి బక్కన్నగారి పల్లె చెరువుకు ఎత్తిపోతల పథకం, లింగాల బ్రాంచి కింద రామట్లపల్లి, గునకలపల్లి చెరువులకు ఎత్తిపోతల పథకం, లింగాల కెనాల్‌పై మరో ఎత్తిపోతల పథకం చేపడుతున్నట్లు... వీటన్నింటికీ సంబంధించి రూ.114 కోట్లు పనులకు ఇవాళ శంకుస్థాపన చేస్తున్నాం'' అని జగన్ వివరించారు. 

''పులివెందుల నియోజకవర్గంలో 7 మార్కెటింగ్‌ గిడ్డంగులను ఏర్పాటు చేస్తున్నాం. పులివెందుల, సింహాద్రిపురం మార్కెట్‌యార్డుల్లో మౌలిక సదుపాయాలకోసం రూ.13.2 కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నాం. దీనికోసం ఇవాళ శంకుస్థాపన చేస్తున్నాం. పులివెందులలో ఇంటిగ్రేటెడ్‌ ప్యాక్‌ హౌస్, కోల్డ్‌ స్టోరేజీకోసం రూ.13 కోట్లు కేటాయిస్తూ ఇవాళ శంకుస్థాపన చేస్తున్నాం. 

నల్లచెరువుపల్లి గ్రామంలో 132కె.వి. విద్యుత్‌ ఉపకేంద్రం ద్వారా 14 గ్రామాలకు లబ్ధి చేకూరుతుంది. దీనికోసం రూ.27 కోట్లు కేటాయిస్తూ శంకుస్థాపన చేశాం. 33/11 కె.వి., 5 విద్యుత్‌ ఉపకేంద్రాల ద్వారా 10 గ్రామాల్లోని వ్యవసాయ పంపుసెట్లకు, దాదాపు 10వేలకు పైగా ఇళ్లకు లబ్ధి. దీనికోసం రూ.10 కోట్లు కేటాయిస్తూ శంకుస్థాపన చేశాం. 

read more  గుంటూరులో ఘోర రోడ్డుప్రమాదం... మానవత్వాన్ని చాటుకున్న ఎమ్మెల్యే

ఆర్‌ అండ్‌ బి ద్వారా రెండు రహదారులను విస్తరిస్తున్నాం. ఓల్డ్‌ కడప టు పులివెందుల, వేంపల్లి టౌన్‌ నుంచి నూలివీడు, పందికుంట, కోళ్లకుంట రోడ్డుకోసం రూ.19.6 కోట్లుతో శంకుస్థాపన చేశాం. పులివెందులలో ప్రాంతీయ వైద్యశాలను అభివృద్ధి చేయడానికి రూ.11.52 కోట్లతో శంకుస్థాపన చేశాం. వేంపల్లిలో కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌ను 30 పడకల నుంచి 50 పడకలకు పెంచుతున్నాం. దీనికోసం రూ.9.30 కోట్లను కేటాయిస్తూ శంకుస్థాపన చేస్తున్నాం. 

ఇంటిగ్రేటెడ్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్, ఇంటిగ్రేటెడ్‌ స్పోర్ట్స్‌ అకాడమీ 14 క్రీడాంశాల్లో అన్నిరకాల వసతులు, శిక్షణ ఇవ్వడానికి రూ.17.5 కోట్ల రూపాయలు కేటాయిస్తూ శంకుస్థాపన  చేస్తున్నాం. ఇడుపులపాయలో వైయస్సార్‌ మెమోరియల్‌ గార్డెన్స్, పర్యాటక సర్క్యూట్‌ కోసం రూ. 20 కోట్లు కేటాయిస్తూ శంకుస్థాపన చేస్తున్నాం. నియోజకవర్గంలో 51 దేవాలయాల పునరుద్ధరణ, ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో ఉన్న 18 కొత్త దేవాలయాల నిర్మాణంకోసం రూ. 16.85 కోట్లు కేటాయిస్తున్నాం.

పులివెందులలో ప్రభుత్వ కార్యాలయాల సముదాయం కోసం రూ. 10 కోట్లు కేటాయిస్తున్నాం. నియోజకవర్గంలో 32 గ్రామ సచివాలయాల భవనాల నిర్మాణంకోసం రూ.11.2 కోట్లు కేటాయిస్తూ శంకుస్థాపన చేశాం.వేంపల్లిలో కొత్త ఉర్దూ జూనియర్‌ కళాశాల కోసం రూ.4.5 కోట్లు కేటాయిస్తూ శంకుస్థాపన చేశాం. వేంపల్లిలో కొత్త డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తూ రూ.20 కోట్ల రూపాయలు కేటాయిస్తూ శంకుస్థాపన చేశాం. జేఎన్టీయూ ఇంజినీరింగ్‌కాలేజీలో లెక్చర్‌ కాంప్లెక్స్, నైపుణ్యాభివృద్ధి కేంద్రం రూ.20 కోట్ల రూపాయలు కేటాయిస్తూ శంకుస్థాపన చేశాం. 

వేంపల్లి మండలంలో బీసీ తరగతుల బాలురు, బాలికల వసతిగృహాల కోసం రూ.4 కోట్ల రూపాయలు కేటాయిస్తూ శంకుస్థాపనం చేస్తున్నాం. ఈ పనులద్వారా రెసిడెన్షియల్‌ వసతి కల్పిస్తున్నాం. పులివెందులలో మోడల్‌ పోలీస్‌ స్టేషన్‌ కోసం రూ.3.64 కోట్లు కేటాయిస్తూ శంకుస్థాపన చేశాం. మొదటివిడత అభివృద్ధి పనులకింద రూ.1329 కోట్ల రూపాయలు ఖర్చుచేస్తూ శంకుస్థాపన కార్యక్రమాలకు శ్రీకారం చేశాం. రాబోయే రోజుల్లో మరిన్ని పనులు చేపడతాం. ప్రతిపాదనలు కూడా తయారుచేస్తున్నాం'' అంటూ భవిష్యత్ లో పులివెందుల నియోజకర్గ పరిధిలో జరిగే అభివృద్ది గురించి జగన్ వివరించారు. 
 
ఇక్కడి ప్రజల ఆశీర్వాదాలు, దేవుడి దయతో  ఈరోజు తాను రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడమే కాకుండా  అందరి రుణం తీర్చుకునే విధంగా కార్యక్రమాలు చేస్తున్నానని అన్నారు. ఇందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. నాన్నను అమితంగా ప్రేమించిన మీరు ఆయన చనిపోయిన తర్వాత  ఎవ్వరూ లేరు అన్న సందర్భంలో తన వెనకాల నిలబడ్డాని భావోద్వేగానికి లోనయ్యారు. ఒకే కుటుంబంలా తోడుగా నిలబడి ఒక బిడ్డగాతనను దీవించారని... రాబోయే రోజుల్లో ఇంకా గొప్పగా మంచిచేసే అవకాశం ఇవ్వాలని దేవుడ్ని కోరుకుంటున్నానంటూ జగన్ ప్రసంగాన్ని ముగించారు.

Follow Us:
Download App:
  • android
  • ios