ఉల్లి ధరల నియంత్రణకు చర్యలు... కేబినెట్ కార్యదర్శితో సిఎస్ చర్చలు
ఉల్లిపాయల సరఫరా తగ్గి ధరలు ఆకాశాన్నంటి సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. ఈ క్రమంలో ధరలను నియంత్రించేందుకు కేబినెట్ కార్యదర్శి ఏపి సీఎస్ తో వీడియో కాన్పరెన్స్ ద్వారా చర్చించారు.

అమరావతి: రాష్ట్రంలో ఉల్లిపాయలు సరఫరాను పెంచి ధరలు నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని వెల్లడించారు. ఉల్లి సరఫరా, ధరల నియంత్రణ అంశంపై సోమవారం ఢిల్లీ నుండి కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వహించారు.
ఈవీడియో సమావేశంలో సిఎస్ నీలం సాహ్ని మట్లాడుతూ రాష్ట్రంలో వినియోగించే ఉల్లిపాయల్లో ఎక్కువ మొత్తం మహారాష్ట్ర నుండే సరఫరా అవుతుంటాయని పేర్కొన్నారు. కొంత మొత్తం ఉల్లిపాయలు స్థానికంగా రైతులు పండించే ఉల్లి పాయలను ప్రజలు వినియోగించడం జరుగుతోందని అయితే ఉల్లి పాయల కొరత ఏర్పడిన నేపధ్యంలో ఉల్లి ధరలు అధికంగా ఉన్నాయని తెలిపారు.
ప్రజలకు ఉల్లి పాయల సమస్యను కొంత వరకూ తగ్గించే ప్రయత్నంలో భాగంగా రాష్ట్రంలోని వివిధ రైతు బజారుల ద్వారా ఉల్లి పాయలను సరఫరా చేయడం జరుగుతోందని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుత సీజన్లో పండించిన ఉల్లి పాయలు వచ్చే జనవరి నుండి మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయని అప్పటికి కొంత వరకూ ఉల్లి సమస్య తగ్గవచ్చని కేబినెట్ కార్యదర్శికి సిఎస్ వివరించారు.
read more ఫలిస్తున్న ప్రభుత్వ చర్యలు... ఏపిలో గణనీయంగా తగ్గిన మద్యం వినియోగం, విక్రయాలు
ఈలోగా కేంద్రం విదేశాల నుండి దిగుమతి చేసుకునే ఉల్లి పాయలను రాష్ట్రానికి సరఫరా చేయాలని విజ్ణప్తి చేశారు. ఉల్లిపాయలను అక్రమంగా నిల్వ చేయడం లేదా అధిక ధరలకు విక్రయించే వారిపై చర్యలు తీసుకునేందుకు విజిలెన్సు విభాగాన్ని అప్రమత్తం చేసి అలాంటి వారిపై దాడులు చేసేందుకు వీలుగా అవసరమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని కేబినెట్ కార్యదర్శి దృష్టికి తెచ్చారు.
ఈ వీడియో సమావేశంలో కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ మాట్లాడుతూ... దేశంలో నెలకొన్న ఉల్లి సమస్యను అధికమించేందుకు కేంద్రం విదేశాల నుండి కొంత మొత్తం ఉల్లిని దిగుమతి చేసుకునేందుకు ఇప్పటికే చర్యలు తీసుకుందని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్థానికంగా అందుబాటులో ఉండే ఉల్లిపాయలను కొనుగోలు చేసి రైతు,బజారులు,ఇతర పంపిణీ పాయింట్ల ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
video:నాణ్యమైన రేషన్ బియ్యం డోర్ డెలివరీ... ఏర్పాట్లపై సీఎం సమీక్ష
వివిధ రాష్ట్రాలవారీ ఉల్లి పాయల సమస్యకు సంబంధించిన పరిస్థితులను తెల్సుకుని ఉల్లిపాయల అక్రమ నిల్వ,అధిక ధరలకు విక్రయించేందుకు ప్రయత్నించే వారిపై నిఘా ఉంచి తగిన చర్యలు తీసుకోవాలని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ స్పష్టం చేశారు. ఈవీడియో సమావేశంలో సహకార మరియు మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి వై.మధుసూదన రెడ్డి, మార్కెటింగ్ శాఖ కమీషనర్ ప్రద్యుమ్న పాల్గొన్నారు.