నాగిరెడ్డి కేశవరెడ్డి అరెస్టు.... బాధితుల పక్షాన నిలబడతాం: హోంమంత్రి
అగ్రిగోల్డ్ స్కామ్, బాధితులకు వైసిపి ప్రభుత్వం అందిస్తున్న సహకారంపై హోంమంత్రి మేకతోటి సుచరిత అసెంబ్లీలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె కేశవరెడ్డి బాధితుల గురించి కూడా ప్రస్తావించారు.
అమరావతి: ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోని అమాయక ప్రజల నుంచి అధిక వడ్డీ ఆశ చూపిస్తూ అగ్రిగోల్డ్ కంపెనీ భారీ మోసానికి పాల్పడిందని ఏపి హోంమంత్రి మేకతోటి శాసనసభలో తెలిపారు. డిపాజిట్లకు బదులుగా భూమి రిజిష్టర్ చేసి ఇస్తామని ఆశచూపి ఈ కంపెనీ భారీగా డిపాజిట్లు సేకరించడం జరిగిందని అన్నారు.
దాదాపుగా రూ.11,57,497 మంది డిపాజిటర్లు ఉన్నారని ఆమె తెలిపారు. రూ.3,944.70 కోట్ల మొత్తాలు ఏపీకి సంబంధించి ఉన్నాయని అన్నారు. వివిధ జిల్లాల్లో 15 కేసులు నమోదు అయ్యాయి. వీటిపై సీఐడీ దర్యాప్తు చేయటం జరిగిందన్నారు. అన్ని కేసుల్లో ఛార్జిషీటు దాఖలు చేయటం జరిగిందని హోంమంత్రి సభలో తెలిపారు.
11 కేసుల్లో విచారణ పెండింగ్లో ఉందని అన్నారు. అగ్రిగోల్డ్ స్థిర, చర ఆస్తులకు సంబంధించి 15 ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా జప్తు చేయటం జరిగిందని హోంమంత్రి తెలియజేశారు. జప్తు చేసిన ఆస్తుల మొత్తం ఎస్ఆర్ఓ విలువ రూ.3785 కోట్లు అని తెలిపారు.
రూ.20 వేలు అంతకంటే తక్కువ డిపాజిట్ చేసిన డిపాజిటర్లకు ఆ మొత్తాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం జరిగిందన్నారు. 2019-20 బడ్జెట్కు సంబంధించి ఆర్థిక సంవత్సరానికి రూ.1150 కోట్లు బడ్జెట్ కేటాయించడం జరిగిందన్నారు.
read more నవరత్నాలన్నారు... ఒక్క రత్నమూ ప్రజలకు అందడంలేదే: బుద్దా వెంకన్న సెటైర్లు
మొదటి విడతగా రూ.10వేలు అంతకంటే తక్కువ డిపాజిట్ చేసిన ఆంధ్రప్రదేశ్లోని 3,69,655 మంది డిపాజిటర్లకు ఈ మొత్తాన్ని పంపిణీ చేయటానికి హోంశాఖ జీఓ నెం.891 ద్వారా రూ.263 కోట్ల 99లక్షల 983వేలు మంజూరు చేయటం జరిగిందన్నారు. ఈ మొత్తాన్ని ఇప్పటికే మొదటి విడతలో బాధితులకు పంపిణీ చేయటం జరిగిందన్నారు.
రూ.20వేలు అంతకంటే తక్కువ డిపాజిట్దారులకు ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులో భాగంగా 3.40 లక్షల మందికి త్వరలో అందజేయటం జరుగుతుందని హోంమంత్రి తెలిపారు.
త్వరలో కేశవరెడ్డి బాధితులకు కూడా న్యాయం చేస్తాం
అగ్రిగోల్డ్పై సభలో చర్చ జరగ్గా పలువురు సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. దీంతో పాటు ఇతర సంస్థల వల్ల మోసపోయిన ప్రజలను ఆదుకోవాలని సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా హోంమంత్రి సుచరిత సమాధానం ఇస్తూ.. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో అగ్రిగోల్డ్ బాధితుల గోడు విన్నారని అన్నారు. అధికారంలోకి రాగానే మొట్టమొదటి కేబినెట్ సమావేశంలో అగ్రిగోల్డ్ బాధితుల కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1150 కోట్లు కేటాయించారని అన్నారు.
ఇలా కేటాయింపులు చేసిన ఘనత జగన్ కే చెందుతుందని సుచరిత పేర్కొన్నారు. అంతేగాకుండా ఇప్పటికే అగ్రిగోల్డ్లో 94% లబ్దిదారులకు చెల్లింపులు చేయటం జరిగిందన్నారు. రూ.20 వేల లోపు ఉన్న డిపాజిటర్లకు త్వరలో చెల్లింపులు జరగబోతున్నాయని ఆమె వివరించారు.
read more ఇప్పటివరకు ఒకలెక్క...ఇప్పట్నుంచీ మరోలెక్క...రాయలసీమపై జగన్ వరాలు
గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి అప్పజెప్పినా.. చిత్తశుద్ధితో కార్యాచరణతో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తున్నామని తెలిపారు. కోర్టు అనుమతి ఇస్తే మిగిలిన లబ్ధిదారులకు కూడా న్యాయం చేస్తామని సుచరిత తెలిపారు.
ఈ సందర్భంగా కేశవరెడ్డి బాధితుల గురించి సభ్యులు ప్రస్తావించారని.. ఇందులో ముద్దాయి అయిన నాగిరెడ్డి కేశవరెడ్డిని అరెస్ట్ చేయటం జరిగిందన్నారు. వీరిపై 13 కేసులు దీనిపై నమోదు అయ్యాయి. దానికి సంబంధించి భూములు, వాహనాలు స్వాధీనం చేసుకోవటం జరిగింది. దీనిపై రివిజన్ పిటీషన్ హైకోర్టులో వేయటం జరిగింది వారికి కూడా న్యాయం చేస్తామని సుచరిత స్పష్టం చేశారు.