పాస్ బుక్ కోసం లంచం డిమాండ్... ఏసీబీ వలలో మరో తహశీల్దార్
కర్నూల్ జిల్లాలో మరో అవినీతి చేప బండారం బయటపడింది. సంజామల ఎమ్మార్వో ఓ రైతు నుండి లంచం తీసుకుంటూ రెడ్ హ్యండెడ్ గా పట్టుబడ్డాడు.
కర్నూల్ జిల్లా సంజామల తహశీల్దార్ గోవింద్ సింగ్ అవినీతి బాగోతం బయటపడింది. ఓ రైతు వద్ద తహశీల్దార్ పాస్ బుక్ కోసం రూ. 5000 తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెగ్ గా పట్టుకున్నారు.
సంజామల మండలం రెడ్డిపల్లె గ్రామానికి చెందిన జక్కుల రామేశ్వర్ రెడ్డి తన తల్లి పేరున ఉన్న పొలానికి పాసుబుక్ కోసం మీసేవలో దరఖాస్తు చేసుకున్నాడు. అనంతరం తహశీల్దార్ గోవింద్ సింగ్ ను కలిసి పాసు బుక్కు ను మంజూరు చేయాలని కోరాడు.
అయితే పట్టాదారు పాస్ బుక్ మంజూరు చేయాలంటే తనకు లంచం ఇవ్వాలని సదరు తహశీల్దార్ కోరారు. రూ 5000 లంచం ఇస్తే పాసు బుక్కు మంజూరు చేయడం జరుగుతుందని చెప్పడంతో లంచం ఇవ్వడం ఇష్టం లేని రామేశ్వర్ రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.
దీంతో రంగంలోకి దిగిన అధికారులు పక్కా పథకం ప్రకారం రైతు నుండి రూ 5000 లంచం తీసుకుంటుండగా తహశీల్దార్ కార్యాలయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పట్టుబడిన తహసిల్దార్ వాసుల గోవింద్ సింగ్ పై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తున్న ట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ అధికారులు సిఐ గౌతమి తో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.